గవర్నర్ తమిళి సై, టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య గ్యాప్ ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. తమిళి సై కేవలం గవర్నర్ గిరీకే పరిమితం కాకుండా తెలంగాణలోని పలు సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగానే అధికార పార్టీ ఆమెకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. శుక్రవారం శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని గవర్నర్ సందర్శించిన సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలుసుకున్నారు. హైదరాబాద్లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్తో కలిసి కవిత అమ్మపల్లి ఆలయంలో జరిగిన బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు.
గవర్నర్ కూడా ఆలయంలో పూజలు చేయాలని నిర్ణయించుకోవడం ఈ అరుదైన సన్నివేశానికి దారితీసింది. తమిళిసై సౌందరరాజన్ పర్యటనపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆలయ అధికారులు గవర్నర్ను చూసి కంగుతిన్నారు. అప్పటికే కవిత అక్కడే ఉండంతో గర్భగుడి వద్ద గవర్నర్, కవిత పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పకుండా రావడంతో శంషాబాద్ ఆలయ అధికారులు ఉలిక్కిపడ్డారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అక్కడకు వచ్చిన ఎమ్మెల్సీ కె.కవితను ఆమె అభినందించారు. అయితే ఆ తర్వాత బతుకమ్మ వేడకల్లో పాల్గొనాలని కవిత గవర్నర్ ను కోరినా.. తమిళి సై హాజరుకాలేదని తెలుస్తోంది. అయితే అంతకుముందు మీర్పేటలోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన బతుకమ్మ పండుగలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బతుకమ్మ పండుగను నిర్వహించడంలో బాలగంగాధర తిలక్ స్ఫూర్తిగా నిలిచారన్నారు.
#Bathukamma https://t.co/gPdPoL7qU7
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 1, 2022