బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై గురి పెట్టింది. ఆ పార్టీ అగ్రనేతలు వరుసగా పర్యటనలు చేస్తున్నారు. పదిహేను రోజు ల వ్యవధిలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచన 75వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ప్రకటించారు.
”హైదరాబాద్ రాష్ట్ర విమోచన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సహా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లకు ఆహ్వానాలు పంపినట్లు ఆయన తెలిపారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో నిజాం పాలన సాగిందని గుర్తు చేసిన కేంద్రమంత్రి.. ఆ కాలంలో హైదరాబాద్ ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు.