మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ…ఈ నోటీసులు జారీ చేసిన ఈసీ…శనివారం మధ్యాహ్నం 3గంటలలోపు వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 25న మునుగోడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై జిల్లా అధికారులను నివేదిక కోరడంతోపాటుగా జగదీశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం.
కాగా ఈనెల 25వ తేదీన మునుగోడు నియోజకవర్గంలోని మల్కాపూర్ లో పర్యటించారు జగదీశ్ రెడ్డి. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే….టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా నిలిచిపోతాయని అన్నారు. రైతు బీమా కావాలంటే టీఆర్ఎస్ కు ఓటేయ్యండి. తెలంగాణలో 24గంటల కరెంట్ ఉంటే..గుజరాత్ లో 6గంటల కరెంట్ మాత్రమే ఉంటుందన్నారు. ఓటు వేసేముందు ప్రజలు ఇవన్నీ గమనించి ఓటేయ్యండి అంటూ కోరారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈసీ నోటీసులు జారీ చేసింది.