CBN Jail Effect In Telangana : మాజీ సీఎం చంద్రబాబును జైలుకు పంపడంపై మంత్రి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని నష్టపరిచేలా ఉన్నాయని సర్వత్రా వినిపిస్తోంది. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన అంశం మనకెందుకు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతున్నాయి. రాజకీయపరమైన అంశంగా చంద్రబాబును జైలుకు పంపడాన్ని ఆయన భావిస్తున్నారు. అంటే, క్లియర్ గా రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందని పరోక్షంగా కేటీఆర్ తేల్చాశారు. ఏపీలోని రెండు పార్టీల మధ్య గొడవగా ఆయన భావించారు. అంటే, పొలిటికల్ గా కక్ష్య సాధించే దిశగా జరిగిన ఎపిసోడ్ గా ఉందని పరోక్షంగా తేల్చారు.
ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబునాయుడు చాలా మందికి రాజకీయ భిక్ష పెట్టారు. ఆయన నీడన ఎదిగిన వాళ్లలో ప్రధానంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరు. ఆయన కూడా చంద్రబాబును జైలుకు పంపించడాన్ని లైట్ గా తీసుకున్నారు. రాజకీయ గురువుగా టీడీపీలో ఉన్నంతకాలం భావించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబును సహచరునిగా మాత్రమే చూస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో రాజకీయ మనుగడ సాగించిన కేసీఆర్ అండ్ కో ఇప్పుడు ఆయన మీద కసి తీర్చుకునేలా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలో మంత్రి కేటీఆర్ కూడా పరోక్షంగా పక్క రాష్ట్రం తలనొప్పి (CBN Jail Effect In Telangana) మనకెందుకు అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో పలు కోణాలను ఆవిష్కరిస్తోంది.
ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ను ఫక్తు రాజకీయ పార్టీగా 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ మార్చేశారు. ఆ తరువాత ఉద్యమకారులను పక్కన పెట్టేశారు. ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వాళ్లను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అధికారాన్ని ఉపయోగించి, 2018 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. ఆ ఎన్నికలు ముగిసిన తరువాత కూడా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి మరో రూపాంతరంగా (CBN Jail Effect In Telangana) టీఆర్ఎస్ ను కేసీఆర్ మార్చేశారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ నామరూపాల్లేకుండా తెలంగాణ వ్యాప్తంగా చేయగలిగారు.
Also Read : TDP : టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ తొలి భేటీ.. జనసేన – టీడీపీ రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
ఫక్తు రాజకీయ పార్టీగా నడుపుతోన్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. దేశ వ్యాప్తంగా విస్తరించాలని కేసీఆర్ తెలంగాణ పేరుతో ఉన్న టీఆర్ఎస్ ను రద్దు చేసుకున్నారు. తెలంగాణ వాదాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసిన ఆయన బీఆర్ఎస్ పార్టీ ద్వారా దేశ వ్యాప్తంగా విస్తరించాలని తొలుత మహారాష్ట్ర మీద కన్నేశారు. ఆ తరువాత ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంగా ఆఫీస్ ను పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమవుతున్నామని ప్రకటించారు. కానీ, ఆ రాష్ట్రంలో జరుగుతోన్న రాజకీయ పరిణామాల మీద స్పందించడానికి మాత్రం మంత్రి కేటీఆర్ కు నోరు రావడంలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబును జైలుకు పంపించడాన్ని వైసీపీ, టీడీపీ మధ్య నడుస్తోన్న రాజకీయ యుద్ధంలో(CBN Jail Effect In Telangana) భాగమని తేల్చాశారు.
Also Read : Jagan Warning :ఎమ్మెల్యేలకు జగన్ హెచ్చరిక..పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తాం
మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలోని లీడర్లు అసహనంగా ఉన్నారు. కొందరు వ్యక్తిగతంగా చంద్రబాబును జైలుకు పంపడాన్ని ఖండిస్తున్నారు. మరికొందరు సైలెంట్ గా ఉన్నారు. ఇంకొందరు సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద బీఆర్ఎస్ పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం ఏపీలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనూ చంద్రబాబు జైలు ఎపిసోడ్ రాబోవు ఎన్నికల మీద ప్రభావం చూపనుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మంత్రి కేటీఆర్ మాదిరిగానే ఇంచుమించుగా కామెంట్ చేశారు. దీంతో వాళ్లిద్దరి వాలకంపై సెటిలర్లు గుర్రుగా ఉన్నారు. వ్యక్తిగతంగా బలమైన సంబంధాలు ఉన్న రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబును జైలుకు పంపడాన్ని ఖండించకపోవడం గమనార్హం.