కూకట్పల్లిలో శనివారం నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కార్మికుల మరణించారు.ఈ ఘటనలో మంజూరైన పర్మిట్ ప్లాన్ను పక్కదారి పట్టించి అనధికారికంగా నిర్మాణాలు చేపట్టినందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) భవన యజమాని పట్లోరి పద్మజకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భవన నిర్మాణానికి అనుమతి రెండు అంతస్తులకు మాత్రమే అయితే మూడు, నాల్గవ అంతస్తుని భవన యాజమాని నిర్మాణం చేపట్టారు. అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టడంపై జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కూకట్పల్లిలోని బీజేపీ ఆఫీస్ రోడ్కు సమీపంలో ఉన్న ప్లాట్ యజమాని 2021 మార్చిలో స్టిల్ట్ ప్లస్ టూ పై అంతస్తుల నిర్మాణానికి భవన అనుమతిని పొందారు. అయితే అనధికారికంగా మూడు, నాల్గవ అంతస్తుల స్లాబ్లను నిర్మించడం ప్రారంభించారు.నాల్గవ అంతస్తు కోసం రెడీ-మిక్స్ కాంక్రీట్తో RCC స్లాబ్ను వేస్తుండగా, స్లాబ్ కూలిపోయి మూడవ అంతస్తు స్లాబ్ను కూడా పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు శిథిలాలలో చిక్కుకుని మరణించారు.
GHMC డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), అగ్నిమాపక విభాగం సహాయంతో, మృతదేహాలను వెలికితీసేందుకు శిధిలాలను తొలగించారు. అనధికార అదనపు అంతస్తులను గుర్తించామని, తదుపరి నిర్మాణాలను నిలిపివేయాలని జనవరి 3న షోకాజ్ నోటీసు ఇచ్చామని జీహెచ్ఎంసీ తెలిపింది. అయితే, యాజమాన్యం నోటీసును పట్టించుకోకుండా జనవరి 7న నాల్గవ స్లాబ్ను వేయడానికి ముందుకు సాగింది. కాంక్రీట్ వేసే సమయంలో భద్రతా చర్యలను పాటించడంలో నిర్లక్ష్యం కారణంగా, స్లాబ్ కూలిపోయిందని తెలిపింది. నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు భవన యజమాని/ సైట్ ఇంజనీర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని GHMC ప్రతిపాదిస్తోంది.