Phone Tapping Den : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు తాజాగా మరో కొత్త విషయాన్ని గుర్తించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటి సమీపంలోని ఓ గెస్ట్ హౌజ్లో సోమవారం ఉదయం పోలీసులు సోదాలు జరిపారు. అది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌజ్ అని.. దాన్ని అడ్డాగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తేలింది. అక్కడే స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)కి సంబంధించిన అప్పటి ఉన్నతాధికారులు భేటీ అయి ఫోన్ ట్యాపింగ్ ప్లాన్ గురించి చర్చించేవారని వెల్లడైంది. ఈ గెస్ట్ హౌస్ నుంచే మాజీ డీసీపీ భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు నడిపినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన ప్రణీత్ రావు, భుజం గరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులు ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌజ్పై స్టేట్మెంట్లు ఇచ్చారని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join
ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌజ్ మేలని అప్పటి ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు టీమ్ భావించిందట. అయితే గెస్ట్ హౌజ్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన యావత్ సమాచారాన్ని భుజంగరావు ముందే మాయం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో రేపోమాపో ఎమ్మెల్సీ నవీన్ రావుతో(Phone Tapping Den) పాటు మరో ఎమ్మెల్సీని పిలిచి పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ నవీన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు.
ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన టీమ్ నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులోనూ వార్ రూమ్లు ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి ఓ కానిస్టేబుల్ భారీ వసూళ్లకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. రౌడీ షీటర్లతో చేతులు కలిపి ఓ పోలీస్ అధికారి సెటిల్మెంట్లు చేశాడని వెల్లడైంది. ఈ కేసులో నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఇప్పటికే అరెస్టయ్యారు. ఇలా అరెస్టయిన ఓ కానిస్టేబుల్ను విచారించగా.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏకంగా 40 మంది మహిళలను లైంగికంగా వేధించారనే విషయం బహిర్గతమైంది.ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ముందే తెలుసుకుని, పోలీస్ ఉన్నతాధికారి స్టీఫెన్ రవీంద్ర ద్వారా వ్యవహారం నడిపించారని పోలీసు దర్యాప్తులో గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన గుట్టంతా టాస్క్ ఫోర్స్ అధికారి రాధాకిషన్ రావు విప్పుతున్నారు. ఉన్నతాధికారి చెప్పినట్లే తాను చేశానని ఆయన అంటున్నారు.