Site icon HashtagU Telugu

MLC Kavitha : నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. బెయిల్ వస్తుందా ?

Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక నిందితురాలిగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha)  ఈరోజు చాలా కీలకం. ఆమెకు బెయిల్ మంజూరవుతుందా ? కాదా ? అనేది మధ్యాహ్నంకల్లా తెలిసిపోతుంది. ఈరోజుతో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ కూడా ముగుస్తోంది. కవితపై ఈడీ, సీబీఐ రెండు కూడా వేర్వేరుగా కేసులను నమోదు చేశాయి. ఇప్పటికే సీబీఐ కేసులో ఆమె బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్‌‌లో ఉంచింది. దానికి సంబంధించిన తీర్పును  మే 2వ తేదీన  న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా ధర్మాసనం వెలువరించనుంది. ఇక ఇవాళ  ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కవితను తిహార్ జైలు నుంచి వర్చువల్‌గా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు. మరోసారి కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ కోరే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join

లిక్కర్‌ స్కాంలో తనను ఈడీ అక్రమంగా మార్చి 15న అరెస్ట్‌ చేసిందని, బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్‌ వేశారు.  దీనిపై సోమవారం వాడివేడిగా వాదనలు జరిగాయి. సాక్షాల ధ్వంసంపైనే ప్రధానంగా విచారణ జరిగింది.  ఫోన్లలోని డిజిటల్ డేటాను కవిత డిలీట్ చేశారని ఈడీ వాదించగా, అలాంటిదేం లేదని కవిత తరపు న్యాయవాది చెప్పారు. కవిత ఇచ్చిన ఫోన్లలో ఎలాంటి డాటా దొరకలేని, ఫోన్లు ఫార్మాట్‌ చేయడం వల్లే డాటా లేదని, ఉద్దేశపూర్వకంగా ఆమె ఫోన్‌లు ఫార్మాట్‌ చేశారని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. ఈడీకి కవిత ఇచ్చిన ఫోన్లలో.. పని మనుషులకు కవిత గతంలో కొనిచ్చిన ఫోన్లు కూడా ఉన్నాయని కోర్టుకు ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితది కీలక పాత్ర అని సీబీఐ ఇటీవల వాదనలు వినిపించింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది.  కాగా, లిక్కర్‌ కేసులో సీబీఐ ఏప్రిల్‌ 11న కవితను అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 2 న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును ఇస్తారు.

Also Read :Arvind Kejriwal : ఎట్టకేలకు తిహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్