MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. ఈడీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు జరిగాయి. కవిత తరఫు న్యాయవాది, ఈడీ తరఫు న్యాయవాది తమతమ వాదనలను వినిపించారు. ‘‘కవితకు కస్టడీ అవసరం. ఆమె బయటికి వెళితే సాక్ష్యాలను తారుమారు చేస్తారు. కేసు విచారణ పురోగతిపై ఆమె ప్రభావం చూపిస్తారు. అందుకే ఆమెను కస్టడీలో కంటిన్యూ చేయాలి’’ ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
ఈక్రమంలో కవిత తరఫు న్యాయవాది రాణా వాదిస్తూ.. ‘‘కవితకు(MLC Kavitha) ఇంకా కస్టడీ అవసరం లేదు. అనవసరంగా ఆమెను జైలులో పెట్టి వేధిస్తున్నారు. ఈడీ దగ్గర కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అందుకే కస్టడీని పొడిగించాలని పదేపదే చెబుతున్నారు. కవిత సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజు నుంచే ఆరోపిస్తున్నారు’’ అని తెలిపారు. దీనికి ఈడీ తరఫు న్యాయవాది బదులిస్తూ.. ‘‘మేం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఇవాళ అందించాం. 60 రోజుల్లోగా కవిత అరెస్టుపై చార్జిషీట్ను కూడా సమర్పిస్తాం’’ అని చెప్పారు. ఈ వాదనలు విన్న కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు (మే 7 వరకు) పొడిగించింది. మే 7 వరకు కవితకు రిమాండ్ విధించింది. ఇక ఇవాళ కవితను వర్చువల్ గా న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.
ఇక సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారమే విచారణ జరిగింది. దానికి సంబంధించిన తీర్పును మే 2వ తేదీకి రిజర్వ్ చేశారు. గత నెల 15వ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు గట్టిగా వాదిస్తున్నారు. కవిత సౌత్ లాబీ నుంచి వంద కోట్ల రూపాయల ముడుపులను సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఈడీ ఆరోపిస్తోంది. కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.మరో 14 రోజుల పాటు కవిత ఆ జైలులోనే ఉండనున్నారు.