బిఆర్ఎస్ (BRS)గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ పార్టీ జోరు పెంచుతోంది. ఖమ్మంలో ఇటీవల తొలి ఆవిర్భావ సభను భారీగా నిర్వహించారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో సభ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5న నాందేడ్ (Nanded) లో సభను నిర్వహించబోతోంది. ఈ సభకు మహారాష్ట్ర ప్రజలతో పాటు, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని బిఆర్ఎస్ నేతలు చెపుతున్నారు.
మరోవైపు నాందేడ్ సభ ఆవిర్భావ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరిశీలించారు. ఈ సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మహారాష్ట్ర ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. జాతీయ పార్టీగా ఎదిగిన బిఆర్ఎస్ కు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
Also Read: Amshala Swamy Passes Away: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ దిగ్భ్రాంతి
తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, ఇతర నేతలతో కలిసి నాందేడ్లో సమావేశానికి వేదికను ఖరారు చేశారు. రెండు మైదానాల్లో ఒకటి స్థానిక గురుద్వారాకు చెందినదని, మరొకటి కళాశాల మైదానమని సమాచారం. వేదికపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. విశాలమైన మైదానంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు బస చేసే అవకాశం ఉన్నందున ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని నిర్వహించాలనే ఆలోచనను విరమించుకున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, సర్దార్ రవీందర్ సింగ్, బాల్క సుమన్, జీవన్రెడ్డి సభ ఏర్పాట్లలో పాల్గొన్నారు. జోగు రామన్న, గోడం నగేష్, రవీందర్ సింగ్ శుక్రవారం గురుద్వారాను సందర్శించి దర్శనం చేసుకున్నారు.