మరోసారి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) vs గవర్నర్ తమిళసై (Governor Tamilisai) వార్ మొదలైంది. మంత్రి మండలి సిఫారసు చేసిన నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ ( BRS govt’s MLC Nominations) తిరస్కరించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల (Dr Dasoju Sravan and Kurra Satyanarayana) అభ్యర్థిత్వాలను ఆమోదించాల్సిందిగా కోరగా.. ఆ సిఫారసులను తమిళిసై రిజెక్ట్ చేశారు. సర్వీస్ సెక్టార్లో వీరు ఎలాంటి సేవలు చేయలేదని.. ఈ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవలో ఈ ఇద్దరికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని.. ఆర్టికల్ 171(5) అర్హతలు సరిపోవని తమిళిసై పేర్కొన్నారు.
తమిళసై వీరి సిఫారసులను తిరస్కరించడం ఫై బిఆర్ఎస్ శ్రేణులు (BRS Leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్గా కొనసాగే నైతిక అర్హత తమిళిసై సౌందర రాజన్కి లేదని మంత్రి వేముల (Minister Vemula Prashanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజ్భవన్ను రాజకీయ అడ్డాగా తమిళసై మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారని , గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపితే గవర్నర్ తిరస్కరించడం ఏంటని మండిపడ్డారు. వారికి రాజకీయ నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం అత్యంత దుర్మార్గం అని అన్నారు.
అత్యంత వెనుక బడిన కులాలకు (ఎంబీసీ) చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్ అని.. షెడ్యుల్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ సమాజాన్ని అగౌరపర్చినట్టేనని అన్నారు. తెలంగాణ గవర్నర్కు నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మరో మంత్రి హరీష్ రావు సైతం తమిళ సై తీరు ఫై నిప్పులు చెరిగారు.
తమిళిసై గవర్నర్లా కాకుండా బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ ఎలా తిరస్కరిస్తారు? అని ప్రశ్నించారు. తమిళిసై ఆది నుంచి తెలంగాణ ప్రగతికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక బిల్లులు గవర్నర్ పెండింగ్లో పెట్టారు. గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని రాజ్యసభకు ఎలా నామినేట్ చేశారో గవర్నర్ చెప్పాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చర్య సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు వంటిదని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakiran Reddy) వ్యాఖ్యానించారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై రాష్ట్ర క్యాబినెట్ చేసిన సిఫారసును గవర్నర్ తిరస్కరించడాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తప్పుపట్టారు.