Site icon HashtagU Telugu

Former Minister Harish Rao: తెలంగాణ అంటేనే బీఆర్ఎస్: మాజీ మంత్రి

Former Minister Harish Rao

Former Minister Harish Rao

Former Minister Harish Rao: వరంగల్‌లో జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Ra) మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఘన విజయాలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఉద్దేశించి విశ్వాసంతో వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలు నిర్వహించిన చరిత్రను గుర్తు చేస్తూ, వరంగల్ అతిపెద్ద సభలకు వేదికగా నిలిచిందని, కేసీఆర్ ఈ రజతోత్సవాన్ని ఇక్కడే జరపాలని నిర్ణయించారని చెప్పారు. “ప్రజలు, కార్యకర్తలు ఎడ్ల బండ్లు, వాహనాలు, సైకిళ్లు, పాదయాత్రగా తరలివస్తున్నారు. కేసీఆర్‌ను చూడాలని, ఆయన ప్రసంగం వినాలని ఉత్సాహంతో వస్తున్నారు,” అని తెలిపారు. ఈ సభ తెలంగాణ ప్రజలకు పండుగ రోజని, “బీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్” అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలను కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో కరువు, ఆత్మహత్యలతో కీడుగా ఉన్న తెలంగాణను అన్నపూర్ణగా మార్చి, వలసలను ఆపి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్‌దేనన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎగరేసిన పార్టీగా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం కష్టపడ్డామని చెప్పారు. కష్టాల్లో ప్రజలు కేసీఆర్, బీఆర్ఎస్ వైపే చూస్తారని నొక్కి చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ “ఏడాదిన్నరలో పాలు, నీళ్ల తేడా తెలిసింది” అని రావు వ్యాఖ్యానించారు. కొత్త పథకాలు లేక, ఉన్నవి బంద్ అయ్యాయని, స్కాలర్‌షిప్‌లు, బతుకమ్మ చీరెలు, కేసీఆర్ కిట్‌లు రద్దయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ దిశాదీనమైన పాలన చేయలేక, రాష్ట్ర ఆదాయాలు తగ్గి, ప్రగతి కుంటుపడిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో ఆడుకుంటూ రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చలేదని, అసెంబ్లీలో ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు.

Also Read: Sajjala Sridhar Reddy : మద్యం కుంభకోణం కేసు.. సజ్జల శ్రీధర్‌రెడ్డికి రిమాండ్‌

రైతుల కోసం బీఆర్ఎస్ చేసిన కృషిని ఉద్ఘాటిస్తూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ఘనత బీఆర్ఎస్‌దేనన్నారు. కాంగ్రెస్ రుణమాఫీ, రైతుబంధు రద్దు చేసి, సాగునీరు, తాగునీరు కూడా అందించలేదని ఆరోపించారు. దేవాదుల, సమ్మక్క సాగర్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యంతో లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయని, కృష్ణా, గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగించిన ఘనత బీఆర్ఎస్‌దేనని చెప్పారు.

సభకు అంచనాలకు మించి జనం తరలివస్తారని, కాంగ్రెస్ నాయకులు కూడా కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపుతున్నారని హ‌రీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమకారులు, రైతులు, మహిళలు, విద్యార్థులు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ట్రాఫిక్ జామ్‌లతో అంతరాయం కలిగించే అవకాశం ఉందని, వాలంటీర్లు సమన్వయంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వరంగల్‌ను జయశంకర్ సార్ ఆశయాలతో ముడిపెడుతూ.. స్థానికులు, వ్యాపారవేత్తలు సహకరించాలని కోరారు. ప్రజల కష్టాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సభ జరుగుతోందని, దాన్ని విజయవంతం చేయాలని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రావు ఆకాంక్షించారు.