సంక్రాంతి తరువాత కీలక అసల కథ మొదలు కానుంది. ఆ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ బీఆర్ఎస్(BRS Delhi) ఆఫీస్ ప్రారంభించిన తరువాత తిరిగి అక్కడికి వెళ్లలేదు. రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆమెకు స్వాగతం పలికారు. ఆమెకు వీడ్కోలు పలికిన తరువాత ఢిల్లీ ఆఫీస్ (BRS Delhi) కు కేసీఆర్ వెళతారని భావించారు. కానీ, ఆ దిశగా ఆయన అడుగులు పడలేదు.
వాస్తవంగా వారానికి మూడు రోజులు ఢిల్లీ, రెండు రోజులు హైదరాబాద్ మిగిలిన రోజులు రాజకీయ మీటింగ్ లకు కేటాయించాలని కేసీఆర్(KCR) సూచాయగా వెల్లడించారు. కానీ, ఆయన ప్రణాళికకు భిన్నంగా రాజకీయాలను నడుపుతున్నారు. ప్రగతిభవన్ నుంచే ఆయా రాష్ట్రాల్లోని బీఆర్ఎస్ కార్యకలాపాలను నడుపుతున్నారు. దేశ వ్యాప్తంగా 100 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల మీద దృష్టి పెట్టారు. ఇవే కాకుండా ఉత్తర భారత దేశంలోనూ బీహార్, యూపీ మీద రాజకీయ ఈక్వేషన్ నడుపుతున్నారు. ఇక జార్ఖండ్ లోనూ అక్కడి సీఎం హేమంత్ సొరేన్ తో టచ్ లో ఉన్నారు. ఆయా పార్టీలకు ఆర్థిక సహాయం అందచేయడంతో పాటు బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
Also Read : BRS Operation: బీ ఆర్ ఎస్ ఏపీ చీఫ్ తోట, కేసీఆర్ ఫస్ట్ ఆపరేషన్ ,JSPకి షాక్
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా కేసీఆర్(KCR) ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. జాతీయ వాదాన్ని బలంగా వినిపిస్తోన్న ఆయన ఆప్ కీ బార్ కిసార్ సర్కార్ అంటూ నినదిస్తున్నారు. దేశ వ్యాప్తంగా రైతు బంధు, ఉచిత విద్యుత్ అంశాలను పరిశీలిస్తున్నారని సమాచారం. సంక్షేమ పథకాలు, రైతుల కోసం ఉచితాలను ప్రకటించడానికి బీఆర్ఎస్ మానిఫెస్టోను రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. జెండా, అజెండాలను ఫిక్స్ చేసిన ఆయన ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. త్వరలోనే హైదరాబాద్ తరహాలో బీఆర్ఎస్ ఆఫీస్ ను విజయవాడ కేంద్రంగా ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతేకాదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని వెల్లడించారు. ఏపీ నుంచి పలువురు బీఆర్ఎస్ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై విచిత్రంగా వైసీపీ, బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ, జనసేనలను బలహీన పరచడానికి కేసీఆర్ ప్లాన్ చేశారని విజయశాంతి చెబుతున్నారు. ఇదంతా గమనిస్తే, బీఆర్ఎస్ ప్రభావం ఎవరి మీద పడుతుంది? అనేది సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒకటే. పార్టీల పరంగా వైసీపీ, బీజేపీ సహజ మిత్రులుగా ఉన్నాయి. అంటే, ఆ మూడు పార్టీలకు చెందిన భావాలు, ఆలోచనలు, వ్యూహాలు ఒకటే. కానీ, బీజేపీ, జనసేన పార్టీలను బలహీనపరచడానికి కేసీఆర్ ఏపీలోకి వచ్చారని విజయశాంతి ట్వీట్ చేయడం గమనార్హం. ఇక బీఆర్ఎస్ ప్రభావం ఏపీలో ఏ మాత్రం ఉండదని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మీడియాకు చెప్పారు. కానీ, ఇప్పటి వరకు టీడీపీ , జనసేన మాత్రం మౌనంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవర్ని రాజకీయంగా బలహీనపరచడానికి కేసీఆర్ వ్యూహం రచించారు అనేది చర్చనీయాంశం అయింది.
Also Read : TTDP : చంద్రబాబు నిజామాబాద్ సభ, కాసాని బస్సు యాత్ర!