తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఆ జిల్లా నుంచి ప్రముఖ లీడర్లను బీజేపీ ఆకర్షిస్తోంది. ప్రధానంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావులపై కన్నేసింది. ఆ ముగ్గరు పార్టీలోకి వస్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీ హవా ఉంటుందని ఆ పార్టీ అధిష్టానం అంచనా వేస్తోంది.ఖమ్మం జిల్లాపై బీజేపీ ఇన్ఛార్జ్లు, కేంద్రమంత్రులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా పార్టీ జిల్లా శాఖ వివిధ సమస్యలపై నిరసనలు చేపడుతోంది. ర్యాలీలు నిర్వహిస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆశాజకంగా ఉందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే ప్రముఖ నాయకులు ఆ పార్టీకి లేకపోవడంతో వెనుకబడి ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు కొందరు చెబుతున్నారు. అందుకే సీనియర్ లీడర్లపై బీజేపీ కన్నేసింది.
టీఆర్ఎస్ తగిన గుర్తింపు, బాధ్యతలు ఇవ్వకపోవడంతో గత కొంత కాలంగా శ్రీనివాస్రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలో ఆయనకు ఫాలోయింగ్ ఉంది. మాజీ ఎంపీ కావడంతో మొత్తం పది నియోజకవర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. తుమ్మల నాగేశ్వరరావుకు మంచి ఫాలోయింగ్ తో పాటు బలమైన క్యాడర్ ఉన్న సీనియర్ నాయకుడు. టీడీపీ ప్రభుత్వంలోనూ, టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి కె.ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. పాలేరు నుంచి మళ్లీ పోటీ చేస్తానని ఇటీవల తుమ్మల ప్రకటించారు. పాలేరుకు ఆయన పేరును టీఆర్ఎస్ క్లియర్ చేస్తుందో లేదో అనుమానమే. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయిన మరో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ, టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుందో అనే సందేహం ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వని పక్షంలో బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. మరోవైపు సీపీఐ కూడా కొత్తగూడెం సీటుపై కన్నేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీఆర్ఎస్తో కలిసి వెళ్లాలని సీపీఐ నిర్ణయించుకుంటే కొత్తగూడెం సీటును సీపీఐకి అప్పగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జలగం వెంకటరావు బీజేపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద జలగం, పొంగులేటి, తమ్మల మీద బీజేపీ బిగ్ ఆపరేషన్ చేస్తోందని సర్వత్రా వినిపిస్తోంది.