తెలంగాణ బీజేపీ దూకుడు మీద ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు దిశగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలను ప్రకటించింది. దాదాపుగా వాళ్లే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. చివరి నిమిషంలో కొందర్ని మినహా ఇదే లిస్ట్ అభ్యర్థిత్వాల విషయంలో ఉంటుందని తెలుస్తోంది.
రెండు ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీతో రెట్టించిన ఉత్సాహంతో సాగుతున్న బీజేపీ ఈ దఫా తెలంగాణలో అధికార పగ్గాలు దక్కేది తమకేనన్న ధీమాతో ఉంది. అదే భావనతో దూకుడుగా వెళుతోన్న బీజేపీ రాష్ట్ర శాఖ శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాబితా విడుదల చేశారు. నియోజకవర్గాల ఇంచార్జీలే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న క్రమాన్ని బీజేపీలో చూస్తున్నాం. దీంతో జాబితాలోని వాళ్లే బీజేపీ అభ్యర్థులుగా ఉంటారని తెలుస్తోంది. అంటే ఏడాది ముందుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది.
బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ లను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp pic.twitter.com/LxqiAjuArA
— BJP Telangana (@BJP4Telangana) October 7, 2022
ప్రస్తుత సభకు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే గడువు ముగియనుంది. ప్రతి ఐదేళ్లకోమారు ఎన్నికలు జరగాలన్న నిబంధన మేరకు వచ్చే ఏడాది డిసెంబర్లోగానే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ మేరకు అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మిగిలిన పార్టీల కంటే ముందుగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా 2023 ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికారం తమదేనన్న సంకేతం ఇచ్చింది.