Bhupalpally – New York : ఆయన పేరు అరుణ్కుమార్ నలిమెల. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి (Bhupalpally – New York) చెందిన ఫొటోగ్రాఫర్గా అరుణ్ చాలా ఫేమస్. ఓ గిరిజన మహిళ సంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఫొటోను ఆయన తన కెమెరాతో క్లిక్ మనిపించారు. అమెరికాకు చెందిన ‘ఎన్ఎఫ్టీఎన్వైసీ’ సంస్థ ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ ఫొటోగ్రఫీ పోటీల్లో అరుణ్కుమార్ పాల్గొన్నారు. ఇందులో వివిధ దేశాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు తీసిన మొత్తం 5 వేల ఫొటోలు పోటీ పడగా.. చివరకు అరుణ్ తీసిన ఫొటోను ఎంపిక చేశారు. ప్రపంచంలోనే ప్రధానమైన కమర్షియల్ జంక్షన్, టూరిస్ట్ డెస్టినేషన్, ఎంటర్టైన్మెంట్ హబ్ అయిన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లోని బిల్బోర్డుపై అరుణ్ తీసిన ఫొటోను ప్రదర్శించారు.
We’re now on WhatsApp. Click to Join
మంగళవారం రాత్రి (మార్చి 26) నుంచి తాను తీసిన ఫొటో ప్రదర్శితం అవుతోందని అరుణ్కుమార్ నలిమెల చెప్పారు. నాలుగు రోజుల పాటు ఈ ఫొటోను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లోని బిల్బోర్డుపై ప్రదర్శిస్తారని వెల్లడించారు. తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని అరుణ్ కుమార్ చెప్పారు. భారత సాంస్కృతిక శాఖ సహకారంతో లలిత కళా అకాడమీ నిర్వహించిన మేళా మూమెంట్ ఫొటోగ్రఫీ పోటీల్లోనూ ఆయన ఇటీవల బహుమతిని అందుకున్నారు. అరుణ్ కుమార్ తీసిన ఫొటోల గురించి గత ఏడాది డిసెంబర్లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించడం విశేషం. అరుణ్ ప్రతిభను కొనియాడారు.