Bhatti Vikramarka: మధిరలో భట్టి నామినేషన్, సీఎం సీఎం అంటూ నినాదాలు!

మధిర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేశారు.

  • Written By:
  • Updated On - November 9, 2023 / 01:30 PM IST

Bhatti Vikramarka: మధిర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర క్యాంపు కార్యాలయం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి తహశీల్దార్ కార్యాలయానికి భారీ ర్యాలీగా బయలుదేరారు. నామినేషన్ దాఖలకు ముందు క్యాంపు కార్యాలయంలో ఎన్నికల్లో విజయం పొందాలని వేద పండితులు వేదమంత్రో చ్ఛారణాలతో విజయీభవ అంటూ ఆశీర్వదించారు.  చర్చి పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

క్యాంపు కార్యాలయం  వద్ద ర్యాలీ బయలు దేరడానికి ముందుగా ప్రచార రథానికి భట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిని విక్రమార్క గారు గుమ్మడికాయతో హారతి ఇచ్చి భట్టి విక్రమార్కకి వీర తిలకం దిద్దారు. భట్టి సీఎం.. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్,  భట్టి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ దారి పొడవునా కార్యకర్తలు బంతిపూల వర్షం కురిపిస్తూ నినాదాలను హోరెత్తించారు. భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలకు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మహిళలు, రైతులు, యువకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. దీంతో మధిర పట్టణంలో దాదాపు కిలోమీటర్  మేరకు ర్యాలీ కొనసాగింది.

Also Read: Delhi: వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి, పిల్లలతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు!