Bharat Dal – October 1st : కేజీ శనగపప్పు ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.90గా ఉంది. దాన్ని ఇక రూ.60కే కొనొచ్చు. ఎలా అంటే.. హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం(హాకా)కు చెందిన ఆటోల ద్వారా !! దేశంలో శనగపప్పు ధరలు రోజురోజుకు పెరుగుతూపోతున్న తరుణంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. తమ దగ్గరున్న శనగ పప్పు నిల్వలను ‘భారత్ దాల్’ పేరుతో ప్యాక్ చేయించి ప్రజా పంపిణీ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు రాయితీపై విక్రయిస్తోంది. తెలంగాణలో ఈ పప్పును విక్రయించే బాధ్యతలను హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం(హాకా)కు కేంద్ర సర్కారు అప్పగించింది. ‘భారత్ దాల్’ విక్రయాలను రేపు (అక్టోబరు 1) హైదరాబాద్ లో హాకా ప్రారంభించనుంది. దాదాపు 50వేల టన్నుల శనగ పప్పును తెలంగాణ వ్యాప్తంగా హాకా ద్వారా సేల్ చేయనున్నారు. తెలంగాణలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 200 ఆటోల ద్వారా భారత్ దాల్ ను ప్రజలకు సేల్ చేస్తారు. ఈ ఆటోల వద్ద కిలో శనగపప్పును రూ.60కి విక్రయిస్తారు. 30 కిలోల బస్తా తీసుకుంటే కిలో రూ.55 ధరకే లభిస్తుంది.
సాధారణ వినియోగదారులతో పాటు దేవాలయాలు, ధార్మిక సంస్థలు, జైళ్లు, పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థలు, షాపింగ్ మాల్స్, ఈ-కామర్స్ సంస్థలు, చిల్లర, టోకు వ్యాపారులు, ఆస్పత్రులు, సామూహిక వంటశాలలు, ప్రాథమిక సహకార సంఘాలకు ఈ పప్పును (Bharat Dal – October 1st) విక్రయించనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్కుమార్ సింగ్, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, హాకా ఛైర్మన్ ఎం.శ్రీనివాస్రావు రేపు (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లో ‘భారత్ దాల్’ సేల్స్ ను ప్రారంభిస్తారు.