ఎండలు (Summer) మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకు భానుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. రోజురోజకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఎండ బారిన పడుతున్నారు. చాలామంది వడదెబ్బతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. తెలంగాణ (Telangana)లో ఈ మూడు రోజుల్లు ఎండలు (Summer) మండిపోనున్నాయి. అయితే ఈ రోజు నుంచి మరో మూడురోజుల (3 Days) పాటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
అది మరింత పెరిగి మే నెలలో 50 డిగ్రీలకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం నాడు సాయంత్రం పలు చోట్ల వానలు కురిసినప్పటికి పగలంతా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు (Heat Wave) నమోదయ్యాయి. 7 జిల్లాల్లో పలుచోట్ల 44 డిగ్రీలకు పైగా, 18 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పెద్దపల్లి జిల్లా మంథనిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ (Nirmal) జిల్లా దస్తూరాబాద్లో 44.8 డిగ్రీలు, నల్లగొండ జిల్లా కట్టంగూర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జంబుగలో 44.7, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.4, జగిత్యాల జిల్లా గోదూరులో 44.3, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నమోదవుతున్న ఉష్ణోగ్రతకన్నా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది.