ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుంది. ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈనెల 25 నుంచే చిన్న బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి చీరలు పంపిణీ చేయనున్నారు. 24 రకాల డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయ రంగులు, 240 రకాల త్రెడ్బోర్డర్తో 100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలు చీరలను తయారు చేశారు. కోటి బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అందించనుండగా, ఇందుకోసం ప్రభుత్వం రూ.339.73 కోట్లు ఖర్చు చేసింది. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ నుంచి వచ్చిన 240 డిజైన్ చీరలను ఆడపడుచులకు అందించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి చీరల పంపిణీ ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 30 సర్కిళ్లలోని 150 డివిజన్లలో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ద్వారా పంపిణీ జరుగుతుంది.