Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు, తప్పిదాల ఫలితంగా రాష్ట్రం ఏ విధంగా దివాళా తీసిందో శాసనసభ సాక్షిగా బయటపడింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.6 లక్షల 71 వేల 756 కోట్లు అప్పు చేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. అదే సమయంలో ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1 లక్షా 27 వేల కోట్లకుపైగా అప్పులు చేసినట్లు కూడా అసెంబ్లీ సాక్షిగా వెల్లడైంది. ఈ రెండు పార్టీలను గెలిపించి అధికారం కట్టబెట్టిన పాపానికి రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారు. ప్రజల చేతికి చిప్ప అందించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు.
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఈ రెండు పార్టీల స్వార్ధ ప్రయోజనాలు, దివాళాకోరు విధానాలవల్ల చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే కొత్తగా మళ్లీ అప్పులు తీసుకునే దుస్థితి ఏర్పడటం అత్యంత బాధాకరం. దివాళా తీసిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు సిద్దమైంది. వాస్తవానికి అధికారంలోకి రావడానికి ముందే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఆర్దిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అనేక సభల్లో చెప్పారు. అయినప్పటికీ 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయడంతోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక అప్పులను సాకుగా చూపి ఇచ్చిన హమీలను అమలు చేయకుండా దాటవేత ధోరణిని అవలంబించడం సిగ్గు చేటు. కాంగ్రెస్ తీరును చూస్తుంటే బీఆర్ఎస్ బాటలోనే నడుస్తున్నట్లు స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కన్పిస్తోంది.
Also Read: FIR Against Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు!
రాష్ట్ర ప్రజలు ఇప్పటికే తమ తాహతుకు మించి వివిధ రూపాల్లో పన్నులు చెల్లిస్తున్నారు. చెమటోడ్చి సంపాదించిన సొమ్ములో పన్నులు చెల్లిస్తూ రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తుంటే కస్టోడియన్ గా ఉంటూ అభివ్రుద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సక్రమంగా వినియోగించాల్సిన పాలక పక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, స్వార్ధ పూరిత ప్రయోజనాల కోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి ప్రజలపై మోయలేనంత భారం మోపడం సిగ్గు చేటు. చేసిన తప్పిదాలను అంగీకరించి, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి… సిగ్గు లేకుండా అప్పులు చేయడం కరెక్టేనని అసెంబ్లీ సాక్షిగా సమర్ధించుకోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టినా బుద్ది రాకపోవడం ఆ పార్టీ నేతల తీరుకు నిదర్శనం.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. అప్పులు తీసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీని మించి పోయింది. ఒక ఏడాదిలోనే రూ.1,27 వేల కోట్లకుపైగా అప్పులు తీసుకుందంటే.. మిగిలిన నాలుగేళ్ల కాలాన్ని కలిపి రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు తీసుకునే పరిస్థితి కళ్లముందే కన్పిస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రం ఊహించనంతగా ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడే ప్రమాదముంది. ఈ అప్పులను తీర్చడానికి ప్రజలపై మోయలేనంతా పన్నుల భారాన్ని వేసే ప్రమాదముంది.
ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రాజకీయాలకు అతీతంగా మేధావులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులతోపాటు తెలంగాణ శ్రేయస్సు కాంక్షించే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతున్నా. ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతం చేసి రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలుకాకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి 6 గ్యారంటీలను అమలు చేయించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తరువాత ఉద్యమాలను ఉధృతం చేస్తామని బండి ప్రకటనలో పేర్కొన్నారు.