Bandi Letter to KCR: సీఎంగారూ పీఆర్సీ ప్లీజ్.. కేసీఆర్ కు ‘బండి’ లేఖ!

బండి సంజయ్ (Bandi Sanjay) సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తక్షణమే (PRC)ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Bandi letter to cm kcr

Kcr Bandi

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సీఎం కేసీఆర్ (CM KCR) కు లేఖ రాశారు. తక్షణమే వేతన సవరణ సంఘం (PRC)ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1, 2023 నుండి పెరిగిన జీతాలు చెల్లించాలని, వారి కనీస హక్కులను పరిరక్షించాలని కోరుతూ పలు విషయాలను లేఖ (Letter)లో ప్రస్తావించారు బండి సంజయ్.

‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం  ఉద్యోగులు, ఉపాధ్యాయుల 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేస్తే ఆనాటి ప్రభుత్వం దిగి వచ్చింది. పార్లమెంట్ లో బీజేపీ (BJP) మద్దతుతో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది స్వరాష్ట్రం ఏర్పాటైంది. స్వరాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాల్సిన మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి వారిని అడుగడుగునా మోసం చేస్తున్నారు. ప్రతినెలా 1వ తేదీన జీతాలు తీసుకోవడం ఉద్యోగుల హక్కుగా ఉన్నప్పటికీ…. సక్రమంగా జీతాలు (Salaries) చెల్లించకుండా వారి హక్కులను కాలరాస్తున్నారు. 317 జీవో అమలు పేరుతో ఉద్యోగుల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డీఏలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు’’ అని బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు.

‘‘PRC అమలు విషయంలోనూ మోసం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో సీఆర్ బిస్వాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి PRC నివేదికను  2018 జూలై 1 నుండి  అమలు చేయాల్సినప్పటికీ 21 నెలలు అమలు చేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టారు. మీ కారణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెంచిన జీతం అమలు కాకుండా 21 నెలలు నష్టపోయారు. ఈ ఏడాది జూన్ 30 నాటితో మొదటి PRC గడువు ముగియబోతోంది.  ఈ ఏడాది జూలై 1 2023 నుండి కొత్త PRC అమల్లోకి రావాలి.  కానీ ఇప్పటి వరుకు మీరు కనీసం PRC కమిషన్ ను నియమించకపోవడం అన్యాయం. ఉద్యోగులను, ఉపాధ్యాయులను దగా చేయడమే అవుతుంది’’ అని బండి సంజయ్ అన్నారు.

‘‘పే రివిజన్ కమిషన్ నివేదిక లేకుండా PRCని ఎట్లా అమలు చేస్తారు? మీ వైఖరిని చూస్తుంటే ఏదో విధంగా జాప్యం చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు PRC ని ఎగ్గోటాలనే ధోరణి కన్పిస్తోంది. ఈ విషయంలో మీరు అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం సమర్ధనీయం కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలకు ద్రుష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త పే రివిజన్ కమిషన్ (PRC)ని ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు 3 నెలల గడువు విధించి నివేదిక తెప్పించుకుని ఈ ఏడాది జూలై నుండి కొత్త PRC ని అమలు చేయాలని కోరుతున్నాం. లేనిపక్షంలో  ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాం’’ అని బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు.

Also Read: Waltair Veerayya Collections: వీరయ్య దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు.. 3 రోజుల్లో 108 కోట్లు!

  Last Updated: 16 Jan 2023, 03:14 PM IST