నిత్యం ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకునే నాయకులు.. అలాంటి నాయకులు సాధారణంగా ఎదురుపడితే ఏంజరుగుతుంది? తగ్గేదేలే అంటూ నిలదీసుకునేల వ్యవహరిస్తారు. కానీ ఆ ఇద్దరు నేతలు రాజకీయాలను పక్కనపెట్టి ఆత్మీయంగా పలుకరించుకున్నారు. చాలా కాలం తరువాత ఎదురుపడిన ఇద్దరు నేతల ఆత్మీయ పలకరింపులకు కరీంనగర్ టవర్సర్కిల్ శుక్రవారం వేదికైంది.
గణేశ్ నిమజ్జనానికి హాజరైన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వేదిక వద్ద ఎదురుపడ్డారు. మూడేళ్ల కిందట కరీంనగర్ పరేడ్ మైదానంలో పరస్పరం అభివాదం చేసుకున్న వీరు ఇప్పుడు ఇలా కలిసి కరచాలనం చేసుకోవడాన్ని పలువురు ఆసక్తి గమనించారు. కాసేపు పక్కపక్కనే నిలబడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.