Site icon HashtagU Telugu

AI Data Centers : ఏఐ పెట్టుబడుల రేసులో తెలుగు రాష్ట్రాలు

Artificial Intelligence Ai Data Centers Cluster Telangana Ap

AI Data Centers :  రూ.10వేల కోట్లతో తెలంగాణలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌(ఏఐ) డేటా సెంటర్‌ క్లస్టర్‌‌ను ‘కంట్రోల్‌ ఎస్‌ డేటా సెంటర్స్‌ లిమిటెడ్‌’ ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి  రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై ఆ కంపెనీ సంతకం చేసింది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌‌ను నెలకొల్పుతారు. 3,600 మందికి జాబ్స్(AI Data Center) లభిస్తాయి.

Also Read :Revanth Reddy Praises : దావోస్ వేదికగా చంద్రబాబు పై సీఎం రేవంత్ ప్రశంసలు

పోటాపోటీగా తెలుగు రాష్ట్రాలు..

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల మంత్రులు, అధికారుల బృందాలు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.

ఏఐపై ఫోకస్..

ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతున్న  నేపథ్యంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌(ఏఐ)పై తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు దృష్టి సారించాయి. దానిలో భాగంగా దావోస్ టూర్‌లో ఏఐ సంబంధిత పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈక్రమంలోనే  తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంట్రోల్ ఎస్ సంస్థ ముందుకొచ్చింది. 10 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో  AI డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ సమక్షంలో ఈ అవగాహనా ఒప్పందం కుదిరింది.

Also Read :Game Changer : నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’..?

అమరావతిలో ఏఐ సిటీ.. 

ఏపీ సీఎం చంద్రబాబుకు మొదటి నుంచే టెక్నాలజీపై చాలా ఆసక్తి. అందుకే ఆయన నేరుగా బిల్ గేట్స్‌ లాంటి టెక్ దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఏఐ విభాగంలో ఏపీకి సాధ్యమైనంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు కసరత్తు చేశారు. మంత్రి నారా లోకేశ్ సైతం అలుపెరగకుండా  పారిశ్రామికవేత్తలతో, టెక్ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశమయ్యారు. కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన, స్థిరమైన భవిష్యత్ నిర్మాణం అనే అంశంపై దావోస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని లోకేశ్ వెల్లడించారు. రిమోట్ సెన్సింగ్, ఏఐ సాంకేతికలను ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఉత్పాదకతను సాధించవచ్చన్నారు. పబ్లిక్ హెల్త్ విభాగంలోనూ ఏఐ వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ, సర్వీస్ డెలివరీని మెరుగుపర్చగలమన్నారు.