77th Independence Day: పంద్రాగస్టు వేడుకలకు గోల్కొడ కోట ముస్తాబు అయింది. స్వాతంత్య్ర దినోత్సవం (77th Independence Day) కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలీసుల రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి. కోటలో పోలీసు అధికారులు భద్రతా చర్యలను సమీక్షిస్తున్నారు. ఈరోజు ఉదయం జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. చారిత్రక గోల్కొండ కోటలో మువ్వన్నెల జెండా పండగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏటా ఆగస్టు 15న గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరణ జరుగుతోంది. ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేశారు అధికారులు. నేడు ఉదయం 11 గంటలకు గోల్కొండ కోటకు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.
మంగళవారం ఉదయం 9.40 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఎగరవేస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్కు వెళ్లి సైనిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 10.45 గంటలకు గోల్కొండ కోటకు చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు.
వేడుకల్లో 12 వందల మంది కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. పంద్రాగస్టు వేడుకల కోసం వచ్చే అతిథులు, ప్రజల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. కోటలో మొత్తం 14 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జలమండలి లక్ష వాటర్ ప్యాకెట్లు, 25వేల వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచనుంది. 2 వేల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. గోల్కొండ ప్రాంతంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయని అధికారులు తెలిపారు.