DSC 2023: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిఎస్సి 2023 (DSC 2023) బుధవారం నుంచి ప్రారంభం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు,వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుండగా,అక్టోబర్ 21న ముగియనుంది. పరీక్షను నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది.
టీఆర్టీని ఈసారి ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు తెలిపిన ప్రభుత్వం దరఖాస్తు ఫీజును భారీగా పెంచింది. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో పరీక్ష జరపాలని నిర్ణయించిన విద్యాశాఖ పరీక్ష ఫీజును రూ.1000గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కూడా రాయితీ ఇవ్వలేదు. ఎంసెట్లో ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.900 మాత్రమే ఫీజుగా ఉంది. ఆ పరీక్ష కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. వాస్తవానికి టీఆర్టీకి పోటీపడే అభ్యర్థుల సంఖ్య ఎంసెట్ కంటే ఎక్కువే ఉంటున్నా ఫీజు మాత్రం భారీగా నిర్ణయించడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షలో ప్రశ్నలు తెలుగు-ఆంగ్లం, ఉర్దూ-ఆంగ్లంలో ఉంటాయి. 160 ప్రశ్నలు.. 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. టెట్లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చారు. రెండింటినీ కలిపి తుది ర్యాంకు నిర్ణయిస్తారు. రోజుకు రెండు విడతల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. తొలుత ఎస్జీటీ అభ్యర్థులకు ఉంటాయి. ఈసారి 1-7 తరగతుల విద్యాభ్యాసం ఆధారంగా స్థానిక, స్థానికేతర అభ్యర్థిగా నిర్ణయిస్తారు. 95% ఖాళీలను స్థానికులతో, 5 శాతాన్ని స్థానికేతరులతో భర్తీ చేస్తారు.టీఆర్టీ ఫలితాల అనంతరం ధ్రువపత్రాల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు.
Also Read: Minister KTR: మహిళ రిజర్వేషన్ లో నా సీటు పోయినా పర్లేదు: కేటీఆర్
ముఖ్యమైన వివరాలు
మొత్తం పోస్టులు: 5089
స్కూల్ అసిస్టెంట్: 1,739
లాంగ్వేజ్ పండిట్: 611
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: 164
సెకండరీ గ్రేడ్ టీచర్: 2,575
అప్లికేషన్ ఫీజు: రూ.1000
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 20
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 21
ఆన్లైన్ పరీక్ష: నవంబర్ 20 నుంచి 30 వరకు