CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహించే వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిలను సీఎం రేవంత్(CM Revanth Reddy) శాలువాతో సత్కరించారు. పూలకుండీ అందించారు. అంతకుముందు హైదరాబాద్లోని ప్రజాభవన్కు వెళ్లి తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను షర్మిల కలిశారు. ఆయనను కూడా జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. తదుపరిగా మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసానికి వెళ్లి 8వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమానికి రావాలని కోరారు.
We’re now on WhatsApp. Click to Join
జూలై ఎనిమిదో తేదీన వైఎస్ 75వ జయంతి కార్యక్రమం ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు విజయవాడలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని షర్మిల ఆహ్వానిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలను కూడా షర్మిల ఆహ్వానించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వైఎస్సార్కు ప్రత్యేక అనుబంధం ఉంది. భట్టి విక్రమార్క ఇప్పటికీ వైఎస్ ఫోటోను తన ఇంట్లో ఉంచుకుంటారు. రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఆయనకు దండం పెట్టుకునే బయలుదేరుతారు. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ సీనియర్ నేతలంతా వైఎస్సార్తో కలిసి పనిచేసిన వారే.
ఈనెల 8న జరిగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం ద్వారా ఆయనకు రాజకీయ వారసురాలిగా ప్రజల్లో గుర్తింపు పొందేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించడాన్ని టాస్క్ గా తీసుకున్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్లోకి జంప్ అయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో జులై 8న జరిగే కార్యక్రమం ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి బాటలు వేయనుంది. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్పై మరింత పట్టును పెంచేందుకు ఈ కార్యక్రమాలు దోహదం చేయనున్నాయి.