హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల పొడవైన కొత్త కారిడార్ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని నిర్ణయించింది. ఈ మార్గాన్ని మూడో దశ కింద చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది.
ఈ కారిడార్ నిర్మాణం ప్రత్యేకంగా ఉండనుంది. ప్రయాణ సమయాన్ని 40 నిమిషాలకు పరిమితం చేసేలా భూమి లోపల (అండర్గ్రౌండ్), పిల్లర్లపై (ఎలివేటెడ్), నేలపై (ఎట్-గ్రేడ్) వెళ్లేలా మిశ్రమ పద్ధతిలో డిజైన్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి కార్గో వరకు 2 కిలోమీటర్లు అండర్గ్రౌండ్లో, ఆ తర్వాత మన్సాన్పల్లి, పెద్ద గోల్కొండ, రావిర్యాల ఎగ్జిట్ల మీదుగా 20 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ మార్గంలో మెట్రో ప్రయాణిస్తుంది.
ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం, రావిర్యాల ఎగ్జిట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 18 కిలోమీటర్ల దూరం భూమిపైనే రైలు పరుగులు పెట్టనుంది. ఇందుకోసం హెచ్ఎండీఏ నిర్మించనున్న 100 మీటర్ల వెడల్పు గల గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్ల స్థలాన్ని మెట్రోకు కేటాయించారు. ఈ మార్గంలో మొత్తం 16 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
వాస్తవానికి, మెట్రో రెండో దశలోని ఐదు కారిడార్ల డీపీఆర్ను హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (HAML) నాలుగు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఈ ఎయిర్పోర్ట్-స్కిల్ వర్సిటీ మార్గాన్ని ఫేజ్-3లో చేపట్టాలని కేంద్రమంత్రి ఖట్టర్ను కోరడం ప్రభుత్వ ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.
