నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకాలేదు. అంజన్కుమార్ ఈడీ ఎదుట హాజరుకాకపోవడానికి ఆరోగ్య సమస్యలను ఉదహరించినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీలపై ఇప్పటికే ఈడీ విచారణ చేసింది. కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డికె శివ కుమార్కు ఈడి నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా, నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక నిర్వహణకు ఇచ్చిన విరాళాలపై ఇడి ఆరా తీసిందని శివ కుమార్ తెలియజేశారు. ఇటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీలకు నోటీసులు జారీ చేసింది. సుదర్శన్ రెడ్డిని అక్టోబర్ 10న, షబ్బీర్ అలీని అక్టోబర్ 11న ఢిల్లీలో విచారణకు పిలిచినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రెండో దశలో గీతారెడ్డి, అంజన్కుమార్ యాదవ్లను విచారణకు పిలుస్తారని సమాచారం.