Amit Shah: తెలంగాణకు అమిత్ షా.. అసంతృప్త నేతలపై ఆపరేషన్ ఆకర్ష్

కర్ణాటక ఎన్నికల తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు మార్పు తర్వాత తెలంగాణ బీజేపీ లో జోష్ తగ్గింది.

  • Written By:
  • Updated On - July 26, 2023 / 03:57 PM IST

కర్ణాటక ఎన్నికల తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు మార్పు తర్వాత తెలంగాణ బీజేపీ లో జోష్ తగ్గింది. మొన్నటి వరకు బీఆర్ ఎస్ కు పోటీగా పార్టీ ఒక్కసారిగా మూడో ప్లేస్ కు పరమితమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా తెలంగాణలో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే మాదిరిగా మారిపోయింది ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించబోతుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలను కూడా చేర్చుకోవడంపై బీజేపీ దృష్టిపెట్టబోతుంది. ఈ మేరకు రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

హైదరాబాద్ పర్యటన సందర్భంగా తన పార్టీ నేతలతోనే కాకుండా.. కొందరు సినీ, రాజకీయ, ఆర్థిక నిపుణులతోనూ అమిత్ షా భేటీ కానున్నారు. అలాగే ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు అమిత్ షాను కలిసిన తర్వాత బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. వీలైతే అమిత్ షా వారికి కండువా కప్పి, నేరుగా పార్టీలోకి ఆహ్వానించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై అమిత్ షా పూర్తి అవగాహనతో ఉన్నారు. పార్టీలో అసంతృప్తులు, అంతర్గత విబేధాలు, తిరుగుబాట్లపై నేతలకు అమిత్ షా గట్టి హెచ్చరిక జారీ చేస్తారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా షా నేతలకు వివరించబోతున్నారు. బీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై నేతలకు తగిన సూచనలు చేస్తారు.

బీఆర్ఎస్‌తోపాటు, కాంగ్రెస్‌కు చెందిన అసంతృప్త నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై దృష్టిపెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి ప్రధానంగా సూచిస్తారు. నిజానికి కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో అమిత్ షా భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. దీంతో పార్టీ శ్రేణులు నిరాశ చెందకుండా అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్‌లో పర్యటించబోతున్నారు. కాగా షా పర్యటనతో తెలంగాణ బీజేపీల్లో నేతల్లో ఆందోళన నెలకొంది.

Also Read: Gangula kamalakar: బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు మరిన్ని వసతులు