Amit Shah Politics: బీజేపీ ఆకర్ష్.. రాజమౌళి, ప్రభాస్ తో అమిత్ షా భేటీ!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు.

Published By: HashtagU Telugu Desk
Amit Shah

Amit Shah

కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ క్యాడర్ రూటు మార్చింది. తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొలిటికల్ గేమ్ కు తెరలేపింది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటక ఎన్నికల దెబ్బతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.  బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినా.. ఆశించిన ప్రయోజనాలు దక్కకపోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగబోతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమిత్ షా, తెలంగాణలో పర్యటించనున్నడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

తన పర్యటనలో అమిత్ షా రాజకీయేతర ప్రముఖులతో సమావేశం కానున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సినీ, రాజకీయ, మీడియా, క్రీడా రంగాల సెలబ్రిటీలతో పలు అంశాలపై షా చర్చించనున్నట్లు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే రాజమౌళి, ప్రభాస్ తో అమిత్ షా భేటీ కానున్నారు. ఇప్పటికే అమిత్ షా ఆర్ఆర్ఆర్ హీరోలు అయినా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. అమిత్ షా వరుసగా సెలబ్రిటీలు, ప్రముఖులను కలుస్తుండటంతో బీజేపీ వ్యూహాలు ఏమిటీ? అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. కేవలం రాజకీయ మైలేజీ కోసమా? బీజేపీ పబ్లిసిటీ కోసమా? హిందూత్వ ఎజెండాను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం కోసమా? అనేక అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి.  పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ మూవీ విడుదలకు సిద్దంగా ఉన్న నేపథ్యంలో ప్రభాస్ తో భేటీ కావడం వెనుక పలు రాజకీయ కారణాలున్నట్టు తెలుస్తోంది.

అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 14న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 15 తేదీ మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలంకు వెళ్తారు. మధ్యాహ్నం 2.20 నుంచి 3.20 గంటల వరకు సీతారాములను దర్శించుకుంటారు. అనంతరం ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటారు.రాత్రి 7 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌ హోటల్ లో పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రి 9:30 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.

Also Read: KGF Hero: బాలీవుడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన కేజీఎఫ్ హీరో, అసలు మ్యాటర్ ఇదే!

  Last Updated: 13 Jun 2023, 05:45 PM IST