కేంద్ర హోమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారనే విషయం తెలిసిందే. అయితే ఆయన పర్యటనపై సందిగ్ధత నెలకొంది. గుజరాత్ తీరానికి బిపోర్ జాయ్ తుపాను ఎఫెక్ట్ పడనుండటంతో.. షా పర్యటన రద్దయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే వరుస సమీక్షలతో అమిత్ షా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితుల దృష్ట్యా తన పర్యటనను రద్దు చేసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు షెడ్యూల్పై క్లారిటీ రాకపోవడంతో టీబీజేపీ నేతల్లో కూడా షా టూర్పై సందిగ్ధత ఏర్పడింది.
జూన్ 15న అమిత్ షా ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. బుధవారం అర్ధరాత్రికి అమిత్ షా హైదరాబాద్ రావాల్సి వుంది. గురువారం ఉదయం ముఖ్యనేతలతో సమావేశం కావడంతో పాటు దర్శకుడు రాజమౌళిని ఆయన కలవాల్సి వుంది. ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి.. బహిరంగ సభలో పాల్గొనాల్సి వుంది. అయితే అకస్మాత్తుగా అమిత్ షా టూరు రద్దవుతుందనే వార్తలు వెలువడటంతో బీజేపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. కాగా టూర్ రద్దుకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడాల్సి ఉంది.
Also Read: Kantara 2 Update: కాంతార-2కు ముహూర్తం సిద్ధం, త్వరలోనే షూటింగ్ షురూ!