Site icon HashtagU Telugu

Telangana Politics: మిషన్ తెలంగాణ.. అమిత్ షా స్కెచ్ లో ఆ ఇద్దరూ ఎవరు?

Amit Shah

Amit Shah

తెలంగాణపై అమిత్ షా ఫుల్ ఫోకస్ పెట్టారు. అందుకే మిషన్ తెలంగాణను స్టార్ట్ చేశారు. ఈ గడ్డపై అధికారంలోకి రావాలని కమలనాథులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యపడలేదు. అందుకే ఇప్పుడు క్షేత్రస్థాయిలో సర్వేలు, అంచనాలు, చేరికల లెక్కలతో లోకల్ పాలిటిక్స్ లో కాక పుట్టిస్తున్నారు. లోకల్ క్యాడర్ ను పూర్తిస్థాయిలో మోహరించడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలను రప్పించేలా వ్యూహం రచించారు.

ఎమ్మెల్యేల వారీగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఒక్కో ఎమ్మెల్యేకు మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యతను ఇచ్చే ఛాన్సుంది. వాళ్లు ఇచ్చే నివేదికలే చాలా కీలకం. తెలంగాణలో రాజకీయ, సామాజిక పరిస్థితులతోపాటు ప్రజా సమస్యలపై వీళ్లు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే టీఆర్ఎస్ వైఫల్యాలపైనా ఆరా తీస్తారు. ఈ సమాచారంతో తయారుచేసిన నివేదికలను దశలవారీగా అమిత్ షాకు పంపిస్తారు.

అమిత్ షా ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఆపరేషన్ తెలంగాణ కొనసాగనుంది. అందుకే ఈ స్థాయిలో భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. లోకల్ గా జరిగే ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు కూడా కేంద్ర అధినాయకత్వం సూచనలు, సలహాలతోనే జరుగుతాయి. దీనిని బట్టి కమలనాథులు దీనిపై ఎంతలా దృష్టి సారించారో అర్థం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికే 26 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఎంపిక చేశారు.

తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇన్ ఛార్జ్ ఎమ్మెల్యేలంతా దాదాపుగా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధ్యయనం చేయడంతోపాటు బీజేపీకి ఫేవర్ గా అక్కడి వాతావరణాన్ని మార్చడమే వీరికి లక్ష్యంగా పెట్టినట్టు తెలుస్తోంది. అసలీ పనికి వేరే రాష్ట్రాల ఎమ్మెల్యేలను ఎందుకు ఎంపిక చేశారన్నదే పెద్ద ప్రశ్న. దీనికి కారణం… లోకల్ నాయకులైతే.. వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చే అవకాశముందని అందుకే అమిత్ షా ఈ వ్యూహంతో ముందుకు వెళుతున్నారని పార్టీ వర్గాల కథనం.

అమిత్ షా ఇప్పటికే 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాల్లో సీనియర్ లీడర్లు, మాజీ ఎంపీలతో ఇప్పటికే రెండు స్పెషల్ కమిటీలను ఏర్పాటు చేశారు. వివిధ వర్గాల్లో ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉందంటున్న బీజేపీ వర్గాలు.. మరింత ఉత్సాహంతో ముందుకెళుతున్నాయి.