తెలంగాణలో డిజిటల్ మౌలిక వసతుల విస్తరణకు మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) అత్యాధునిక డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం దశలవారీగా రూ.60 వేల కోట్ల పెట్టుబడులను అమెజాన్ పెట్టనుంది. ఇందుకోసం మొత్తం 300 ఎకరాల భూమిని అమెజాన్ ఉపయోగించుకోనుంది. ఈ మెగా ప్రాజెక్టుకు ఇవాళ (బుధవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
ఈ అమెజాన్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 300 ఎకరాలను కేటాయించింది. ఇందులో ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందన్వెల్లిలో మరో 98 ఎకరాలు ఉన్నాయి. అంతేకాకుండా రూ.125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. 2025లో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, అమెజాన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలతో ఈ పెట్టుబడికి బీజం పడగా.. ఆ తర్వాత తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం, అమెజాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటుతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ హబ్గా ఎదగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబై తర్వాత దేశంలో అమెజాన్ రెండో క్లౌడ్ రీజియన్ కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు కానుండటం విశేషం. తొలి దశలో నిర్మాణ పనులు 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మిగిలిన విస్తరణ పనులు వచ్చే 10 ఏళ్లలో దశలవారీగా పూర్తి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్, ప్రభుత్వ డిజిటల్ సేవలు, హెల్త్టెక్, స్టార్టప్లు మరియు పరిశ్రమలకు అవసరమైన డిజిటల్ మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి. అలాగే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఫ్యూచర్ సిటీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) అభివృద్ధికి ఈ అమెజాన్ పెట్టుబడి కీలకంగా మారుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.
