Warangal Airport : తెలంగాణలో మరో ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) కసరత్తును వేగవంతం చేసింది. ఇంతకీ ఎక్కడో తెలుసా ? వరంగల్ నగరంలోని మామునూరులో !! ఔను.. మామునూరులోని పాత ఎయిర్ స్ట్రిప్ స్థానంలో కొత్త ఎయిర్ పోర్టును నిర్మించనున్నారు. దీనికోసం గతేడాదే తెలంగాణ ప్రభుత్వం అదనపు భూమిని కూడా కేటాయించింది. ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల టీమ్ ఆ స్థలాన్ని పరిశీలించింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు సంబంధించిన హెలికాప్టర్ల నుంచి మొత్తం ఏరియాను పరిశీలించారు. ఇక్కడ కొత్త విమానాశ్రయ నిర్మాణం కోసం ప్రాథమిక భూ సర్వే చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ కసరత్తును మొదలుపెట్టింది. ప్రస్తుతం వరంగల్ ఎయిర్ స్ట్రిప్కు 706 ఎకరాల భూమి ఉంది. ప్రాంతీయ విమానాశ్రయంగా తొలిదశ అభివృద్ధికి కనీసం 400 ఎకరాలను అందించాలని తెలంగాణ సర్కారును ఏఏఐ కోరింది. అందులో భాగంగా 253 ఎకరాలను కేటాయిస్తూ గతేడాది ఆగస్టు 10నే రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
జీఎంఆర్ ఎయిర్పోర్టు నిర్మాణం సందర్భంగా 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం అభివృద్ధి చేయకూడదన్న నిబంధన పెట్టారు. దీంతో వరంగల్లో విమానాశ్రయం ప్రారంభానికిగానూ జీఎంఆర్ ఎయిర్ పోర్టు నుంచి అనుమతి అవసరమైంది. ఎందుకంటే వరంగల్ ఎయిర్పోర్టు(Warangal Airport).. శంషాబాద్లోని జీఎంఆర్ ఎయిర్ పోర్టుకు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Also Read : Airport : ఇప్పటికి ఎయిర్ పోర్ట్ లేని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా..?
వాస్తవానికి తెలంగాణలోని 6 ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల క్రితమే ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రతిపాదించింది. మామునూరు (వరంగల్), జక్రాన్పల్లి (నిజామాబాద్), ఆదిలాబాద్, బసంత్నగర్ (పెద్దపల్లి), కొత్తగూడెం, గుడిబండ (మహబూబ్నగర్)ల పేర్లను ప్రపోజ్ చేసింది. దీనిపై 2019లో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాథమిక అధ్యయనం చేసి ఆరు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసింది. అయితే అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం కుదరకపోవడంతో వ్యవహారంలో జాప్యం ఏర్పడింది.