Congress Party: రేవంత్ పై అధిష్టానం సీరియస్.. ప్రియాంకకు తెలంగాణ పగ్గాలు?

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతూ ఎన్నికల సమరంలోకి దూసుకుపోతుంటే, మరోవైపు టీ కాంగ్రెస్ లో ఎక్కడ

  • Written By:
  • Updated On - November 26, 2022 / 03:37 PM IST

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతూ ఎన్నికల సమరంలోకి దూసుకుపోతుంటే, మరోవైపు టీ కాంగ్రెస్ లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ఆ పార్టీ పరిస్థితి ఎంటో స్పష్టంగా తెలియజేసింది. కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేని స్థితిలోఉందనీ ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. దీనికితోడు అంతర్గత విబేధాలు, నేతలు పార్టీలు మారడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పని తీరుపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తితో ఉన్నది. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లను కాదని, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టింది.

సీనియర్లు, జూనియర్లు అందరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పి మరీ రేవంత్‌కు పదవి ఇస్తే.. ఆయన పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని అధిష్టానం భావిస్తోంది. రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇచ్చే సమయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్లు పూర్తిగా వ్యతిరేకించారు. తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. అయితే, వారితో కలిసి పని చేయాలని చెప్పినా.. రేవంత్ రెడ్డి మాత్రం చొరవ తీసుకోలేదు. పీసీసీ చీఫ్ పదవి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి రేవంత్‌తో కలిసి పని చేయడానికి నిరాకరిస్తూ వచ్చారు. మిగిలిన సీనియర్లు కలిసినట్లే కలిసి.. తిరిగి రేవంత్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు చేశారు. అంతే కాకుండా టీపీసీసీ కార్యవర్గంలో అంతా తన మనుషులే ఉండేలా రేవంత్ పావులు కదిపారు.

ఇది సీనియర్లకు మరింత ఆగ్రహం తెప్పించింది. జగ్గారెడ్డి మొదట్లో రేవంత్‌తో కలిసినట్లే కనిపించినా.. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు తనను పిలవడం లేదని అలిగారు. కనీసం సంగారెడ్డి వచ్చిన సమయంలో కూడా తనకు సమాచారం ఇవ్వలేదని మీడియా ముందు వాపోయారు. రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని అధిష్టానం ఆదేశించినా.. ఏదో ఒకటి రెండు కార్యక్రమాలతో రేవంత్ సరిపెట్టారు. ఇక పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరుగా వేరే పార్టీల్లో చేరుతున్నా.. వారిని నిలువరించడంలో రేవంత్ విఫలమైనట్లు అధిష్టానం భావిస్తోంది.

కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతుందో అగ్రనాయకత్వానికి తెలియజేయలేదని మండిపడుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్‌తో కలిసి పార్టీని చక్కదిద్దుతారని భావిస్తే.. అలా జరగకపోగా, పరిస్థితి మరింతగా దిగజారిపోవడాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నది. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ కూడా ఏమాత్రం పనిచేయడం లేదని తేలడంతో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ బాధ్యతలను ప్రియాంకగాంధీకి ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.