తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల సమయానికి తమ సినిమాలు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ప్రధాన పాత్రలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. దేశ సమస్యలు, సామాజిక అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని.. నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమాకు బొమ్మక్ మురళి దర్శకత్వం వహిస్తుండగా.. అద్దంకి దయాకర్ సరసన ఇంద్రజ, ప్రధాన పాత్రలో హీరో సుమన్ నటిస్తున్నారు. జైభారత్ అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. నేటి సామాజిక అంశాలు, రాజకీయ విలువలతో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఏపిల్ర్ 14న విడుదలకానుంది. ఈ కాగా ఈ మూవీలో గద్దర్ ఓ స్పెషల్ పాట పాడినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లలో కనిపించిన దయాకర్, సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇస్తుండటంతో అతడి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి కిశోర్పై ఓటమి పాలయ్యారు. రెండు సందర్భాల్లోనూ అద్దంకి దయాకర్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2014లో 2,379 ఓట్ల తేడాతో,2018లో 1,847 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఎలగైనా గెలువాలని అద్దంకి గట్టిగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ అద్దంకి దయాకర్ కు మరింత ప్లస్ గా మారనుంది.