Telangana – Adani : స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో తెలంగాణలో పెట్టుబడులపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రూ.12,400 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా అదానీ గ్రూపునకు చెందిన పలు కంపెనీలతో నాలుగు అవగాహన ఒప్పందాలను తెలంగాణ సర్కారు కుదుర్చుకుంది. పరిశ్రమలకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని గౌతమ్ అదానీకి సీఎం రేవంత్ రెడ్డి(Telangana – Adani) ఈసందర్భంగా హామీ ఇచ్చారు.
- గ్రీన్ ఎనర్జీ విభాగంలో రూ.5000 కోట్లు, డేటా సెంటర్ విభాగంలో రూ.5000 కోట్లు. ఏరోస్పేస్ అండ్ రక్షణ విభాగంలో రూ.1000 కోట్లు, అంబుజా సిమెంట్ గ్రిడ్డింగ్ యూనిట్లో రూ.1400 కోట్లు పెట్టుబడి పెడతామని అదానీ గ్రూప్ అనౌన్స్ చేసింది.
- అదానీ ఎంటర్ప్రైజెస్ చందనవెల్లిలో రూ.5000 కోట్లతో 100 మెగావాట్ల డేటా సెంటర్ను నెలకొల్పనుంది.
- అదానీ గ్రీన్ ఎనర్జీ మరో రూ.5 వేల కోట్లతో 1350 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను నాచారం, కోయబస్తీ గూడంలలో ఏర్పాటు చేయనుంది.
- అంబుజా సిమెంట్స్ రూ.1400 కోట్లతో దాదాపు 70 ఎకరాల్లో ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సిమెంటు పరిశ్రమను నెలకొల్పనుంది. అయిదారేళ్లలో సిమెంటు ప్లాంటు పనులు పూర్తయ్యాక సుమారు 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని అదానీ గ్రూప్ వెల్లడించింది.
- అదానీ ఎయిరోస్పేస్ పార్కులో కౌంటర్ డ్రోన్, క్షిపణుల పరిశోధన, అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తిపై రానున్న పదేళ్లలో అదానీ గ్రూప్ రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆరాజెన్ కంపెనీ సీఈవో మణి కంటిపూడి సమావేశమయ్యారు. ఈ కంపెనీ రూ.2000 కోట్లతో మల్లాపూర్లో ఉన్న పరిశ్రమ విస్తరించాలని నిర్ణయించింది.దీంతో 1500 మందికి ఉపాధి లభిస్తుందని ఆరాజెన్ సీఈవో చెప్పారు. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, జేఎస్డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, ఎల్డిసీ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం సమావేశమైంది. ఈ లెక్కన దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్కు విశేష స్పందన లభిస్తున్నట్లు అయింది. రాష్ట్రానికి పెట్టుబడులను సాధించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది.