హైదరాబాద్ లోని ఘట్కేసర్లోని విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూషన్ లో బీటెక్ చదువుతున్న బాలికల చిత్రాలను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ (Morphing) చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది నిందితులు బాలిక విద్యార్థుల వాట్సాప్ల డిపిలను డౌన్లోడ్ చేసి, అశ్లీల చిత్రాలతో చిత్రాలను మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో పంచుకున్నారు. విద్యార్థినులకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. అఘాయిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు కళాశాల ఆవరణలో గురువారం ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలోనే VBIT కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థినుల ఫొటోలను మార్ఫింగ్ చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కాలేజీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. యాజమాన్యం వెంటనే స్పందించి దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎట్టకేలకు పోలీసుల ఈ కేసులో పురోగతి సాధించారు. ఈ కేసులో పోలీసుల అదుపులో నిందితుడు ప్రదీప్ ఉన్నాడు. మరి కొంతమంది నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా కళాశాలో పరీక్షలు సైతం రద్దు చేసి సంక్రాంతి పండుగ సాకుతో స్టూడెంట్స్ ను ఇంటి బాట పట్టించింది కళాశాల యాజమాన్యం.