ర్యాగింగ్ కారణంగా మెడికో ప్రీతి మృతి చెందడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఏబీవీపీ ఈ రోజు( సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. మెడికో మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆమెను వేధించిన సైఫ్ను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. హెచ్ఓడీ, ప్రిన్సిపల్ని కూడా సస్పెండ్ చేయాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తరచూ వెలుగులోకి వస్తున్న ర్యాగింగ్ సంస్కృతిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేక డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి నిన్న(ఆదివారం) రాత్రి మరణించినట్లు నిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. ప్రీతి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరైయ్యారు. ప్రీతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని తరలించే సమయంలో నిమ్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ కూతురుకు న్యాయం చేయాలంటూ నిమ్స్ ఐసీయూ వద్ద ప్రీతి తల్లిదండ్రులు బైఠాయించి నిరసన తెలిపారు.