Abhishek Boinapally : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో ఉన్న తన భార్యకు చికిత్స చేయించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు ఆమోదించింది. అభిషేక్ బోయినపల్లికి ఐదు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరైనట్లు తెలిసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు ఇస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. పాస్పోర్టును సరెండర్ చేయాలని అభిషేక్ను ఆదేశించింది. ట్రయల్ కోర్టు అనుమతితో హైదరాబాద్కు వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 2022 నవంబర్ 13న అభిషేక్ బోయినపల్లి అరెస్టయ్యారు. 19 నెలలుగా జైలులో ఉన్న అతడికి ఎట్టకేలకు ఇప్పుడు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join
లిక్కర్ స్కామ్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా విచారణకు ఆదేశించడంతో 2022 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్ఐ ఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఆగస్టు 22న ఈడీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అదే ఏడాది నవంబరు 25న తొలి చార్జిషీటు దాఖలైంది. 2021 జూన్లో హైదరాబాద్కు చెందిన కొందరు వ్యాపారులు, రాజకీయ నాయకులు సౌత్ గ్రూప్ పేరుతో ఢిల్లీ రాజకీయ నేతలతో లావాదేవీలు జరిపారని అందులో పేర్కొంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించారని వెల్లడించింది. సీబీఐ చార్జిషీటు ప్రకారం దొడ్డిదారిన అక్రమార్జన కోసమే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారు. హోల్సేల్గా 12 శాతం లాభాలు, రిటైల్గా 185శాతం లాభాలు ఆర్జించాలని ప్రణాళికలు రచించారు. ఢిల్లీలో హోల్సేల్ వ్యాపార సంస్థ అయిన ఇండో స్పిరిట్ గ్రూప్నకు 65శాతం వాటా కేటాయించేందుకు అంగీకరించారు. ఇందులో సౌత్ గ్రూప్నకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 9 రిటైల్ జోన్లను కేటాయించారు.