Telangana Speaker Dismissed Disqualification Petition On Brs Mlas : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువరించారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి. కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట్టింది. దీంతో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంతో స్పీకర్కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది.
- కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరుతూ పిటిషన్లు
- సుప్రీంకోర్టు గడువు నిర్ణయించడంతో విచారణ పూర్తి
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిసెంబరు 17 (బుధవారం) తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల ఆరోపణలను స్పీకర్ తోసిపుచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావులు ఫిరాయింపులకు పాల్పడలేదని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ వాదనలతో ఏకీభవించని స్పీకర్.. ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్య విషయంలో నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో స్పీకర్ తీర్పు వెలువరించారు.
2023 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన 10 మంది ఎమ్మెల్యేలు.. తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరుతూ బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం. ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీలో చేరితే అనర్హలుగా ప్రకటించాలి. కానీ, అధికారికంగా మారడం లేదా విప్ ధిక్కరించాల్సి ఉంటుంది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని మర్యాదపూర్వకంగా సీఎంను కలిశామని స్పీకర్ వద్ద వివరణ ఇచ్చారు.
మిగతా ఐదుగురు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ల అనర్హత పిటిషన్లపై విచారణ జరిిగింది. వీరిలో కడియం, దానం నాగేందర్లు తమ నిర్ణయం చెప్పడానికి స్పీకర్ను కొంత సమయం కోరారు. పోచారం, కాలే యాదయ్య, సంజయ్ కుమార్లపై పిటిషన్ల విచారణ పూర్తి కావడంతో త్వరలోనే స్పీకర్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
తాము స్పీకర్కు ఫిర్యాదు చేసినా అనర్హతపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని తొలుత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. పదో షెడ్యూల్ ప్రకారం అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం… 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జులై 2025న ఆదేశించింది. అక్టోబర్ 31తో మూడు నెలల గడువు పూర్తికావడంతో ‘గ్రాస్ కంటెంప్ట్’ అంటూ సుప్రీంకోర్టు హెచ్చరించింది. నాలుగు వారాల్లో అంటే డిసెంబర్ 18లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు స్పష్టం చేసింది. ఈ క్రమంలో స్పీకర్ విచారణ ముగించి, ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి తొలి దశలో తీర్పు ఇచ్చారు.
