Delhi Liquor Scam : ఢిల్లీ, తెలంగాణ, ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతున్న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును మొదటి నుంచీ విచారిస్తున్న ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ నాగ్ పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జడ్జి జస్టిస్ కావేరీ బవేజా నియమితులయ్యారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీ జ్యుడీషియల్ విభాగం పరిధిలోని మరో 50 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు కవితను మంగళవారం మూడో రోజు ఈడీ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. విచారణలో భాగంగా ఇండో స్పిరిట్ కంపెనీలో 33 శాతం వాటా ఎలా వచ్చిందని కవితను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. 100 కోట్ల ముడుపులను ఎలా చెల్లించారని ప్రశ్నలు అడిగారట. మొబైల్ ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చిందని ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. విచారణ అనంతరం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణ పూర్తయ్యాక సోదరుడు కేటీఆర్ న్యాయవాదులు కవితను కలిశారు. కవిత ప్రస్తుతం ఏడు రోజుల ఈడీ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంబంధించి ఈడీ ఆమెను ప్రశ్నిస్తోంది. మార్చి 23న సాయంత్రం 5 గంటల వరకు ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నారు.
ఈ కేసులో (Delhi Liquor Scam) కవితే కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని ఈడీ వాదిస్తోంది. శరత్రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంటతో కలిసి ఆప్ నేతలకు ఆమె రూ. 100 కోట్లు లంచం ఇచ్చారని చెబుతోంది. మార్జిన్ మనీని 12శాతానికి పెంచారని ఈడీ తెలిపింది. అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారనిపేర్కొంది. ‘‘లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారు. సమన్లు జారీచేసిన తర్వాత 4 ఫోన్ల డేటాను ఫార్మాట్ చేశారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కవిత ఒప్పందం కుదుర్చుకున్నారు. అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారు. లిక్కర్ పాలసీలో బిజినెస్ కోసం కవిత తనను సంప్రదించారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు మాగుంట స్టేట్మెంట్ ఇచ్చారు’’ అని కవిత కస్టడీ రిపోర్టులో ఈడీ సంచలన విషయాలు పేర్కొంది.