Uttam Kumar Reddy: గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. రేపట్నుంచి స‌న్న‌బియ్యం పంపిణీ!

తెలంగాణ రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉన్నత నాణ్యత గల సన్న బియ్యంను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉన్నత నాణ్యత గల సన్న బియ్యంను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యం స్థానంలో ఇకపై పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సన్న బియ్యం అందుబాటులోకి రానుంది.

తెలంగాణ ప్రభుత్వం 2025 మార్చి 30న సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఉగాది పర్వదిన సందర్భంగా ఈ సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఘనంగా ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంయుక్తంగా ఆరంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల బీపీఎల్ రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం అంద‌జేస్తారు. ఈ వివరాలను రాష్ట్ర సాగు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 2.81 కోట్ల రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం అందజేస్తున్నప్పటికీ, దానిలో 70-80 శాతం వినియోగంలోకి రాకుండా తిరిగి వ్యర్థమవుతోంది లేదా పౌల్ట్రీ ఫామ్‌లు, బ్రూవరీలకు వెళ్లిపోతోంది. ప్రభుత్వం ప్రతి కిలో దొడ్డు బియ్యం కోసం రూ. 40 ఖర్చు చేస్తూ.. సంవత్సరానికి రూ. 10,665 కోట్లు వెచ్చిస్తోంది. అయినప్పటికీ ఈ వ్యవస్థ వల్ల లబ్ధిదారులకు నిజమైన ప్రయోజనం చేకూరడం లేదు. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఉచిత సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

Also Read: Solar Eclipse: ఈ ఏడాది భారతదేశంలో సూర్య గ్ర‌హ‌ణం ఎందుకు కనిపించదు?

కొత్త రేషన్ కార్డులతో మరిన్ని కుటుంబాలకు లబ్ధి

గత ప్రభుత్వాలు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంలో విఫలమయ్యాయి. కుటుంబ సభ్యులను చేర్చే అవకాశం కల్పించలేదు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో చురుకైన చర్యలు తీసుకుంటోంది. త్వరలో బీపీఎల్ కుటుంబాలకు త్రివర్ణ కార్డులు, ఎపీఎల్ కుటుంబాలకు ఆకుపచ్చ కార్డులు మంజూరు కానున్నాయి. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్ల నుండి 3.10 కోట్లకు పెరిగే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు.

ప్రజల గౌరవం, ఆహార భద్రత కోసం

“ఇది కేవలం బియ్యం పంపిణీ మాత్రమే కాదు తెలంగాణ ప్రజల గౌరవాన్ని, ఆహార భద్రతను కాపాడే సంకల్పం,” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. “ప్రతి బీపీఎల్ కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం,” అని ఆయన పేర్కొన్నారు. ఉగాది రోజున ప్రారంభమయ్యే ఈ పథకం ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో విస్తరించి అమలు చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు బహిరంగంగా పాల్గొనాలని మంత్రి ఆహ్వానించారు. ఈ పథకం తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారికి గౌరవప్రదమైన జీవనాన్ని అందించే దిశగా ఒక ముందడుగుగా నిలుస్తుంది.

  Last Updated: 29 Mar 2025, 02:17 PM IST