Praja Palana: ప్రజాపాలన తొలిరోజైన గురువారం నాటికి 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు రాగా, అన్ని మున్సిపాలిటీల నుంచి జీహెచ్ఎంసీతో కలిపి 4,57,703 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై సమీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ డి కిషోర్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కేంద్రంలో ఆరు గ్యారెంటీలకు సరిపడా దరఖాస్తు ఫారాలను అందించాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు. తొలిరోజు ఈ కార్యక్రమానికి రూరల్, అర్బన్ ప్రాంతాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, దరఖాస్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు.
ఉదయం నుంచి ఫారాలు సమర్పించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో కేంద్రం వద్ద తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరారు. శాంతికుమారి మాట్లాడుతూ ప్రతి 100 మందికి ఒక కేంద్రాన్ని తెరవాలన్నారు. దరఖాస్తు ఫారమ్లను పూరించడానికి ప్రజలకు సహాయపడటానికి ప్రత్యేక సహాయ డెస్క్లు కూడా సెట్ చేయబడ్డాయి. వారి దరఖాస్తుల నవీకరించడానికి వ్యక్తులకు ప్రత్యేక నంబర్ ఇవ్వబడుతుంది.
Also Read: Telangana Crimes: 2023లో తెలంగాణలో నేరాలు పెరిగాయి: డీజీపీ రవిగుప్తా