Indian Students Dead : అమెరికా గడ్డపై ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. చనిపోయిన వారిని తెలంగాణలోని వనపర్తికి చెందిన 22 ఏళ్ల గట్టు దినేష్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన 20 ఏళ్ల నికేష్గా గుర్తించారు. వీరిద్దరు రూమ్ మేట్స్. దినేష్, నికేష్ మరణానికి ఖచ్చితమైన కారణమేదీ తెలియలేదు. దినేష్ తండ్రి గట్టు వెంకన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ వల్లే నిద్రలో దినేష్ చనిపోయి ఉంటాడని ఆయన తండ్రి వెంకన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోందని, శవపరీక్షలు పూర్తయిన తర్వాత భౌతికకాయాన్ని ఇండియాకు తీసుకొస్తామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘రూంలో రాత్రి నిద్రపోయిన దినేష్, నికేష్ ఎంతకూ మరుసటి రోజు(ఆదివారం) ఉదయం నిద్రలేవలేదు. దీంతో తోటి స్నేహితులు వారి రూంకు వెళ్లి నిద్ర లేపేందుకు యత్నించారు. అయినా నిద్రలేవ లేదు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు అంబులెన్స్కు ఫోన్ చేశారు. దినేష్, నికేష్ను పరీక్షించిన వైద్యులు.. వాళ్లు అప్పటికే చనిపోయారని వెల్లడించారు’’ అని దినేష్ మేనమామ సాయినాథ్ వివరించారు. శనివారం రాత్రి భోజనం చేసి గదిలో పడుకున్న దినేష్, నికేష్ నిద్రలోనే మృతిచెందారని.. అంతకు మించి ఇతర విషయాలు తమకు తెలియవని బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. మృతదేహాలను త్వరగా తీసుకువచ్చేందుకు సహకరించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పట్టా పొందిన గట్టు దినేష్.. 16 రోజుల క్రితమే అమెరికాకు వెళ్లి కనెక్టికట్లోని సేక్రేడ్ హార్ట్ యూనివర్సిటీలో ఉన్నత విద్య కోసం(Indian Students Dead) చేరాడు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని అమెరికా నుంచి వనపర్తికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులను మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పరామర్శించారు.