14 Villagers – Voting Twice : తెలంగాణ – మహారాష్ట్ర మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంతో ఆ 14 గ్రామాల ఓటర్లు రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేయాల్సి వస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లోనూ ఆ ఊళ్ల ప్రజలు అటు మహారాష్ట్రలో, ఇటు తెలంగాణలో ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ పద్నాలుగు ఊళ్ల పరిధిలో 3,357 మంది ఈవిధంగా రెండు చోట్ల ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. తొలి దశ పోలింగ్లో భాగంగా తాజాగా శుక్రవారం రోజు మహారాష్ట్రలోని చంద్రాపూర్ లోక్సభ స్థానంలో వీరు తమ ఓట్లు వేశారు. మళ్లీ మే 13న తెలంగాణ పరిధిలోని ఆదిలాబాద్ లోక్ సభ స్థానంలోనూ వీరు ఓట్లు వేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- తెలంగాణలోని కొమురంభీం జిల్లా కెరమెరి, మహారాష్ట్రలోని చంద్రా పూర్ జిల్లా జివితి తాలూకా పరిధిలోని పరందోలి, కోట, శంకర్కులొద్ది, ముకధం గూడ, లెండి గూడ, ఈసాపూర్, మహర్జా గూడ, అనంతపూర్, భోలాపూర్, గౌరీ, లేందీజలా, లక్మాపూర్, జంకపూర్, పద్మావతి గ్రామాలపై సరిహద్దు వివాదం ఉంది.
- ఈ 14 పల్లెలు(14 Villagers – Voting Twice) ఏ రాష్ట్రానికి చెందినవి ? అనే దానిపై గత నాలుగు దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ పరిష్కారం మాత్రం నేటికీ దొరకలేదు.
- తెలంగాణ – మహారాష్ట్ర బార్డర్లోని ఆయా 14 గ్రామాలకు చెందిన 3357 మంది ఓటర్లలో 1,763 మంది మహిళలు.. 1,594 మంది పురుషులు ఉన్నారు.
- వీరిని తెలంగాణలో ఎస్టీ లంబాడాలుగా, మహారాష్ట్రలో బీసీ సంచార తెగలుగా గుర్తించారు.
- మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు 1983లో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ 14 గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తారని అప్పట్లో తీర్మానించారు.
- ఈ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ 1991లో మహారాష్ట్రలోని రాజురా ఎమ్మెల్యే వామనరావు చాటప్ అసెంబ్లీలో నిరసన తెలిపారు.
- ఈ పరిణామాల నేపథ్యంలో 1996లో మహారాష్ట్రలోని బీజేపీ, శివసేన ప్రభుత్వం.. ఆ 14 ఊళ్లను ఏపీకి అప్పగించే కేబినెట్ ఉత్తర్వులను రద్దు చేసింది.
- దీనిపై అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా.. నేటికీ దీనిపై పీఠముడి వీడలేదు.
- ఈ 14 గ్రామాల ప్రజలు అటు మహారాష్ట్రకు, ఇటు తెలంగాణకు చెందకుండా సమస్యలతో అరిగోస పడుతున్నారు. వీరిని ఎన్నికల టైంలో ఓటర్లుగా వాడుకోవడమే తప్ప.. ఎన్నికల తర్వాత పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు.