తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కోనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లు, మొదటి రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత కొనసాగినప్పటికీ.. తరువాత రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి మట్ట రాగమయి లీడ్లోకి వచ్చారు. మూడు రౌండ్లు ముగిసేసరికి 4800 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రాగమయి ముందంజలో ఉన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇరు పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు. తాను పక్కా లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి మట్ట రాగమయి ప్రచారం చేశారు. నియోజకవర్గంలో పొంగులేటి, తుమ్మల అనుచరులు బలంగా ఉండటంతో మట్ట రాగమయికి అనుకూలంగా ఉంది. ఇదే విధంగా ఆధిక్యం కొనసాగితే భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రాగమయి గెలిచే అవకాశం ఉంది.