దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రమాదకరమని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థులు, ప్రచారకుల భద్రతపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని ఆదేశిస్తున్నానని ఆమె తెలిపారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల కోసం శాంతియుత , సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించడం చాలా అవసరమన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యయత్నం ఘటనలో నిందితుడు బీజేపీ కార్యకర్త అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్రావు మాత్రం ఆ ఆరోపణలు ఖండించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే.. కొత్తా ప్రభాకర్ రెడ్డి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడని ఆయన ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో గెలివాలనే కుతంత్రాలు చేస్తున్నారని రఘునందన్రావు ఆరోపించారు.
Also Read: Nijam Gelavali : రేపటి నుంచి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన