ఇండియన్ మార్కెట్లో వన్ ప్లస్ (OnePlus) బ్రాండ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రీమియం ఫీచర్లతో మిడ్ రేంజ్ ఫోన్లను రిలీజ్ చేయడం వన్ ప్లస్ ప్రత్యేకత. అందుకే వన్ ప్లస్ బ్రాండ్ నుంచి విడుదలయ్యే స్మార్ట్ ఫోన్లు (Smart Phones) హాట్కేకుల్లా అమ్ముడవుతాయి. ఇప్పుడు ఇదే పాపులారిటీతో తన మార్కెట్ను మరింతగా విస్తరించే పనిలో వన్ ప్లస్ ఉంది. ఇందులో భాగంగానే డెస్క్టాప్ మానిటర్ల విభాగంలోనూ అడుగుపెడుతోంది. డిసెంబర్ 12న కొత్తగా రెండు డెస్క్టాప్ మానిటర్లను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోంది. వన్ ప్లస్ మానిటర్ ఎక్స్ 27, వన్ ప్లస్ మానిటర్ ఈ24 పేర్లతో ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ పేజీలో పెట్టిన టీజర్లో పేర్కొంది. అలాగే అధికారిక వెబ్సైట్లోనూ ప్రకటించింది. ఉచితంగా మానిటర్లను గెలుచుకునేందుకు ఒక లక్కీ డ్రాను కూడా కంపెనీ నిర్వహిస్తోంది.
The #OnePlusMonitors are here to change the game. Stay tuned: https://t.co/YE8W06LvdR #OnePlus #NeverSettle pic.twitter.com/Jzx6vP5H0g
— OnePlus India (@OnePlus_IN) November 30, 2022
వన్ ప్లస్ ఎక్స్27 మానిటర్ మోడల్ 27 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక వన్ ప్లస్ ఎక్స్ 24 మోడల్ 24 ఇంచుల స్క్రీన్తో వస్తుంది. వీటిలో ఓ మోడల్ పోట్రయిడ్ మోడ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మానిటర్లలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అదిరిపోతుందని వన్ ప్లస్ తన టీజర్లో పేర్కొంది. అయితే వీటి ధరలపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఎక్స్ 27 మానిటర్ ప్రీమియం రేంజ్, ఈ24 మానిటర్ మిడ్ రేంజ్లో లభించనున్నాయి. దేశంలోని కొనుగోలుదారుల కోసం ఈ మోడల్లను రూ.20,000 లోపు విడుదల చేసే అవకాశం ఉంది.
వన్ ప్లస్ తన ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను క్రమంగా విస్తరిస్తోంది. ముందుగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లు మాత్రమే రిలీజ్ చేసిన సంస్థ క్రమంగా మిడ్ రేంజ్ మార్కెట్ను ఆక్రమించింది. కేవలం రూ.25 వేల ధరలోనే ప్రీమియం ఫీచర్లు గల ఫోన్లను విక్రయిస్తోంది. దీంతో ఇండియాలో చాలా తక్కువ సమయంలోనే మోస్ట్ పాపులర్ బ్రాండ్గా నిలిచింది. ఈ పాపులారిటీని కాపాడుకుంటూనే క్రమంగా వేరే ప్రొడక్ట్స్ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. నెక్ బ్యాండ్స్, ఇయర్ బడ్స్, ఇతర ఆడియో ప్రొడక్ట్లను లాంచ్ చేస్తుంది. ఇటీవలే స్మార్ట్ వాచ్లను కూడా లాంచ్ చేసింది. మరో వైపు స్మార్ట్ టీవీల మార్కెట్లోనూ వన్ ప్లస్ జోరు కొనసాగుతోంది. ఇండియాలో ప్రస్తుతం టాప్ 3 స్మార్ట్ టీవీ బ్రాండ్లలో వన్ ప్లస్ ఒకటిగా ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
ఇప్పుడు డెస్క్టాప్ మానిటర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టి, ఇండియా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లక్ష్యంగా కృషి చేస్తోంది. రియల్మీ, వన్ ప్లస్ కంపెనీలు ఇతర ఇండియన్ బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇవి తక్కువ ధరలోనే నాణ్యమైన ప్రొడక్ట్లను రిలీజ్ చేస్తుండటంతో గణనీయమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీని తట్టుకునేందుకు ఇతర కంపెనీలు సైతం తమ ప్రోడక్ట్ ధరలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది.