Elon Musk : ప్రపంచంలోనే సంపన్నుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొన్నప్పటి నుంచి దానిలో ఎన్నెన్నో మార్పులు చేశారు. ట్విట్టర్కు ఎక్స్ అని పేరు పెట్టడం దగ్గరి నుంచి దానిలో ప్రీమియం ఫీచర్లను ప్రవేశపెట్టడం వరకు చాలానే మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఎక్స్కు చెందిన అన్ని విభాగాల్లోనూ ప్రీమియం సబ్స్క్రయిబర్లను పెంచుకునే పనిలో ఎలాన్ మస్క్(Elon Musk) ఉన్నారు. ఈక్రమంలోనే త్వరలో మనం కొత్త మార్పును చూడబోతున్నాం.
We’re now on WhatsApp. Click to Join
ఇకపై ఎక్స్లో లైవ్స్ట్రీమ్ను ప్రారంభించాలంటే కచ్చితంగా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉండాల్సిందే. ఈవిషయాన్ని లైవ్ ప్రొఫైల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. అంటే రానున్న రోజుల్లో ప్రీమియం సబ్స్క్రైబర్లు మాత్రమే ‘ఎక్స్’లో లైవ్ స్ట్రీమ్ చేయగలరు. అయితే ఎప్పటినుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయనేది తెలియరాలేదు. ‘ఎక్స్’ బేసిక్ సబ్స్క్రిప్షన్ ధర నెలకు రూ.215 నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, టిక్టాక్ వంటి సోషల్మీడియా యాప్స్లో లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీగా లభిస్తోంది. అలాంటప్పుడు ఎక్స్ తీసుకున్న నిర్ణయం ప్లస్ అవుతుందా ? మైనస్ అవుతుందా? అనే దానిపై నెటిజన్ల నడుమ వాడివేడి చర్చ జరుగుతోంది. ఫ్రీగా లైవ్ స్ట్రీమ్ చేసేందుకు అవకాశం కల్పించే సోషల్ మీడియా యాప్లనే ప్రజలు వాడుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘ఎక్స్’కు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం పడిపోతోందని.. అందుకే ప్రీమియం సబ్స్క్రైబర్ల ఆదాయంపై అది ఆధారపడుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కొత్త యూజర్లకు షాకిచ్చే మరో నిర్ణయాన్ని ఎక్స్ తీసుకుంది. ఎక్స్లో కొత్త యూజర్లు చేసే పోస్ట్తో పాటు, లైక్, రిప్లయ్, బుక్మార్క్ చేయాలన్నా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. ఇప్పటికే ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్లోని కొత్త యూజర్ల నుంచి ఈ రుసుములు వసూలుచేయడం ప్రారంభించింది. ఆ దేశాల్లో కొత్త ఎక్స్ యూజర్లు ఫాలో, బ్రౌజింగ్ మాత్రమే ఫ్రీగా చేయగలరు. మిగతా ఏం చేయాలన్నా ఫీజు కట్టాల్సిందే.